న్యూఢిల్లీ : పంజాబ్లో తీవ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి. పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్న విషయం తెలిసిందే. కేంద్ర పాలిత ప్రాంతాలైన చండీగఢ్, మొహాలీలో పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ భారీ ఉగ్ర దాడికి పాల్పడేందుకు పన్నాగం పన్నుతున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో బస్టాండు, బహిరంగ ప్రదేశాల్లో పోలీసులు భద్రతను పెంచారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో భద్రతను పటిష్టం చేసేందుకు సీనియర్ అధికారులతో చర్చించారు.
నగరాల్లోని బస్టాండులు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో అదనపు బలగాలను మోహరించాలని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రధానంగా ఏడు సరిహద్దు జిల్లాల్లో మరింత నిఘా పెంచాలని డీజీపీ స్పష్టం చేశారు. ఆయా నగరాల్లో ప్రజా రవాణాకు సంబంధించిన వాహనాలను సీఆర్పీఎఫ్, పోలీసులు బృందాలు తనిఖీ చేస్తున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు ప్రయాణికుల లగేజీలను సైతం తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే పంజాబ్లో తీవ్రవాదులు ఉగ్రదాడికి కుట్ర చేసినట్లు తేలింది. ఇటీవల ఢిల్లీలో పట్టుబడిన నలుగురు ఉగ్రవాదులు ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. ఈ నలుగురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసుల సహాయం పంజాబ్ పోలీసులు అరెస్టు చేయగా.. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకొని వేర్వేరుగా విచారిస్తున్నారు.
ప్రధాని పర్యటనకు ముందు నిషేధిత ఉగ్రవాద సంస్థ సిక్కు ఫర్ జస్టిస్ అధినేత గురు పత్వంత్ సింగ్ పన్ను హెచ్చరించాడు. ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తామని పన్ను పేర్కొన్నాడు. ఈ మేరకు వీడియోను సైతం విడుదల చేరశాడు. ఈ నెల 24న ప్రధాని మోదీ న్యూ చండీగఢ్, మొహాలీలో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. మరో వైపు రాష్ట్రంలోని నలుగురు కాంగ్రెస్ కీలక నేతలకు సైతం భద్రతను పెంచనున్నారు. వీరిలో మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్ సింగ్ రంధావా, మాజీ మంత్రి గురుకీరత్ కోట్లి, విజయ్ ఇందర్ సింగ్లా, మాజీ ఎమ్మెల్యే పర్మీందర్ సింగ్ పింకా ఉన్నారు. పంజాబ్లో 400 మందికిపైగా వీఐపీల భద్రతను తొలగించిన తర్వాత సిద్ధూ ముసేవాలా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత భద్రతను తగ్గించాలన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెద్ద దుమారమే చెలరేగింది.