Swati Maliwal | ఢిల్లీలోని జామా మసీదులోకి మహిళల ఎంట్రీపై విధించిన నిషేధంపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మగవారు లేదా కుటుంబసభ్యులు లేకుండా మహిళలు జామా మసీదు ప్రాంగణంలోకి రాకుండా మసీదు నిర్వాహకులు నోటీసు ఇచ్చారు. జామా మసీదు మూడు గేట్ల వద్ద నోటీసులను అతికించారు. ఈ నిర్ణయంపై వివిధ మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ తీవ్రంగా స్పందించారు.
‘ఇదేమన్నా ఇరాన్ అనుకుంటున్నారా? అంటూ జామా మసీదు నిర్వాహకులపై ఒంటికాలుపై లేచారు. ఇది ముమ్మాటికీ పురుషాహంకారమే అని అన్నారు. జామా మసీదు షాహీ ఇమామ్ చేసిన తాలిబానీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ నోటీసు జారీ చేయనున్నట్లు స్వాతి మలివాల్ వెల్లడించారు. మసీదులో మహిళలు స్వేచ్ఛగా ప్రవేశించకుండా, వారి మతాన్ని ఆచరించకుండా నిరోధించడం పూర్తిగా వివక్షతతో కూడుకున్నదని ఆమె అభిప్రాయపడ్డారు. పురుషులు తోడు లేకుండానే మహిళలు ప్రార్థనా స్థలాలకు వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ఇటువంటి ఉత్తర్వులు స్త్రీ ద్వేషపూరితమైనవే కాకుండా భారత రాజ్యాంగం ధర్మానికి విరుద్ధమని పేర్కొన్నారు.