లక్నో : భారత దేశానికి 2014లోనే స్వాతంత్య్రం వచ్చిందన్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆమెకు ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని సామాజిక మాధ్యమాల్లో డిమాండ్లు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అలీగఢ్లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, కంగన పేరు ప్రస్తావించకుండానే.. ఆమె చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై విరుచుకుపడ్డారు. ‘ఓ మొహతర్మా (మేడమ్) అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. 2014లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందని ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు.
ఒక ముస్లిం ఆమె చేసిన వ్యాఖ్యలే చేసి ఉంటే.. యూపీఏపీ చట్టం కేసు పెట్టి.. మొదట మోకాళ్లపై కాల్పులు జరిపి.. ఆ తర్వాత జైలుకు పంపేవారు’ అన్నారు. దేశద్రోహం కేసులు కేవలం ముస్లింలపై మాత్రమే పెడుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి 2014లో స్వాతంత్య్రం వచ్చిందా? 1947లో వచ్చిందా? అంటూ ప్రధానిని, యూపీ సీఎం యోగిని ప్రశ్నించిన ఆయన.. ఆమె రాణి.. మీరు రాజు (యోగి ఆదిత్యనాథ్).. అయితే మీరు ఏం చేయరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన భారత్ – పాక్ టీ20 మ్యాచ్ అనంతరం పాక్ గెలుపొందడంతో సంబరాలు చేసుకున్న వారిపై దేశద్రోహం కింద కేసులు పెడుతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కంగన రనౌత్పై దేశద్రోహం అభియోగాలు మోపుతారా?.. విద్రోహం కేసులు కేవలం ముస్లింలపై మాత్రమేనా? అంటూ ప్రశ్నించారు.