Omar Abdullah : జమ్మూకాశ్మీర్లో సీఎం ఒమర్ అబ్దుల్లా ఆధ్వర్యంలోని ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే, ఇప్పుడీ ప్రభుత్వంలో అసమ్మతి ఎక్కువైందని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమైందని, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న ఒమర్ తన పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేవం ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 90 సీట్లున్నాయి. అధికారం కావాలంటే 46 సీట్లు గెలవాలి.
2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒమర్ ఆధ్వర్యంలోని ఇండీ కూటమి విజయం సాధించింది. ఇందులో ఒమర్ పార్టీ అయిన జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్సీపీ)కి 42 స్థానాలు దక్కగా, కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు దక్కాయి. దీంతో 48 సీట్లతో ఒమర్ ప్రభుత్వం అధికారం దక్కించుకుంది. ఇక బీజేపీకి 29, పీడీపీకి 3, సీపీఎం 1, ఆప్1, జేపీసీకి 1 సీట్లు దక్కగా, ఇండిపెండెంట్లకు 7 స్థానాలు దక్కాయి. అయితే, ప్రస్తుతం ఈ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. చాలా మంది ఒమర్ నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రతిపక్ష బీజేపీ సహా అప్నీ పార్టీ నేతలు కూడా ప్రస్తావిస్తున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, వారు పార్టీని వీడేందుకు ప్రయత్నిస్తున్నరని చెప్పారు.
దీంతో పార్టీ నేతల్ని బుజ్జగించేందుకే ఒమర్ అబ్దుల్లా జూన్ 3న ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు. మునిగిపోతున్న నౌకను కాపాడుకునేందుకు చివరి ప్రయత్నంగా ఒమర్ ఈ సమావేశం ఏర్పాటు చేశారని బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు సునీల్ శర్మ అన్నారు. అయితే, ఈ ప్రచారాన్ని జేకేఎన్సీపీ నేతలు ఖండిస్తున్నారు. తమ పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని చెబుతున్నారు. ఈ ప్రచారంపై సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. తమ ప్రభుత్వంపై మాట్లాడేవారు ప్రతిపక్షంలో కూర్చున్నారని విమర్శించారు. ఏదేమైనా ఈ సమావేశం కోసం ప్రతిపక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.