DMK : తమిళనాడు (Tamil Nadu) లో అధికార డీఎంకే (DMK) పార్టీలో వారసత్వ పోరు కొనసాగుతున్నదా..? మేనత్త కనిమొళి (Kanimozhi), మేనల్లుడు ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) వారసత్వం కోసం పోటీ పడుతున్నారా..? ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) తనయుడు ఉదయనిధిని తన రాజకీయ వారసుడిగా నిలబెట్టాలని చూస్తున్నారా..? ఉధయనిధికి పోటీగా స్టాలిన్ సోదరి డీఎంకే వారసత్వాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా..? అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలను చూస్తుంటే పై ప్రశ్నలన్నింటికీ ఔననే సమాధానం వస్తున్నది.
ఇటీవల తిరునెల్వేలి జిల్లా పాళయంగోట్టయ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో డీఎంకే అభ్యర్థికి మద్దతుగా ప్రసంగించేందుకు కనిమొళి పోడియం వద్దకు వచ్చారు. అంతే ఆమె మద్దతుదారులు ఎన్నడూ లేనంతగా పెద్దఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ‘కాబోయే సీఎం కనిమొళి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అభిమానుల నుంచి ఊహించని స్పందనకు ఆమె ఆశ్చర్యపోయినా.. వారిని వారించకుండా ఆమె మౌనంగా ఉండిపోయారు. దీన్ని బట్టి ఆమెకు సీఎం పదవిపై కన్ను ఉన్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పార్లమెంటులో చురుకైన గొంతుకగా, క్షేత్రస్థాయిలో బలమైన నాయకురాలిగా గుర్తింపు సాధించుకున్న ఆమెకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. పాళయంగోట్టయ్ ఎన్నికల ప్రచారసభలో ప్రజలు చేసిన నినాదాలే అందుకు నిదర్శనం. స్టాలిన్ తన కుమారుడికి అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో కనిమొళికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తున్నారనే అసంతృప్తి ఆమె వర్గంలో ఉన్నది. దక్షిణ తమిళనాడులో కనిమొళికి సమాచారం ఇవ్వకుండానే ఉదయనిధి పర్యటనలను ఖరారు చేయడం వివాదాస్పదమైంది.
ప్రొటోకాల్ పాటించలేదని కనిమొళి వర్గం అభ్యంతరం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. దాంతో తిరునెల్వేలి, కోవిల్పట్టిలో జరగాల్సిన ఉదయనిధి స్టాలిన్ యువజన విభాగ సమావేశాలు చివరి నిమిషంలో రద్దయ్యాయని సమాచారం. ఈ క్రమంలోనే పాళయంగోట్టయ్లో తమ నాయకురాలి ఆదిపత్యం నిరూపించేందుకు అభిమానులు నినాదాలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఒకవైపు కుమారుడిని తన వారసుడిగా నిలబెట్టాలనే కోరిక.. మరోవైపు క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న సోదరి.. ఈ ఇద్దరి మధ్య సమన్వయం చేయడం స్టాలిన్కు రాజకీయంగా పెద్ద సవాల్ అనే చెప్పవచ్చు.