Dwarka Expressway | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): భారత్మాల పరియోజన- 1(బీపీపీ-1) కింద ఢిల్లీ – గుర్గావ్ల మధ్య ‘ద్వారకా ఎక్స్ప్రెస్ వే’ నిర్మాణంలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టు కాగ్ వెల్లడించింది. 29 కిలోమీటర్ల ఈ రహదారికి అంచనా వ్యయాన్ని ఒక కిలోమీటరుకు రూ.18 కోట్ల నుంచి రూ.250 కోట్లకు పెంచారని తెలిపింది. డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు లేకుండానే అంచనా వ్యయాన్ని అనూహ్యంగా పెంచేశారని కాగ్ తప్పుబట్టింది.
ప్రత్యామ్నాయాన్ని పరిశీలించలే!
ఎనిమిది లేన్ల ప్రధాన క్యారేజ్ వేని ఎలివేటెడ్గా నిర్మించడం కంటే అండర్ పాస్లు, ఫ్లై ఓవర్లుగా కూడా నిర్మించవచ్చని కాగ్ తెలిపింది. అండర్పాస్ల నిర్మాణం వల్ల భారీ వ్యయాన్ని తగ్గించవచ్చని పేర్కొంది. కుడి మార్గంలో అందుబాటులో ఉన్న 90 మీటర్లలో నిర్మిస్తే మరింత వ్యయం తగ్గుతుందని తెలిపింది. ఈ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ పథకాన్ని పరిశీలించకుండానే లేన్ల కాన్ఫిగరేషన్లు నిర్ణయించారని పేర్కొంది.
టెండర్లలోనూ అవకతవకలు
టెండర్ల ఎంపిక ప్రక్రియలోనూ అవకతవకలు జరిగినట్లు కాగ్ పేర్కొంది. తప్పుడు పత్రాల ఆధారంగా కాంట్రాక్టర్లను ఎంపిక చేయడం, షరతులు, నియమ, నిబంధనలను బిడ్డర్లు పాటించకపోవడం తదితర అవకతవకలు చోటుచేసుకున్నాయని తెలిపింది. సమగ్ర ప్రాజెక్టు నివేదికలు మంజూరు కాకుండానే పనులను మంజూరు చేశారని కాగ్ తప్పుబట్టింది.
అవినీతిలో రికార్డులు బద్ధలు!
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని అవినీతి రికార్డులను బద్ధలు కొట్టిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం విమర్శించారు. మోదీ ప్రభుత్వం భారత్మాల ప్రాజెక్టులో రూ.7.5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.