గువాహటి, ఏప్రిల్ 2: అస్సాం రాజధాని గువాహటిలో 2021, నవంబర్ 4న సీఎం హిమంత బిశ్వ శర్మ 1.2 కిలోమీటర్ల మేర నిర్మించిన ఓ రెండు లైన్ల ఫ్లైఓవర్ను ప్రారంభించారు. భారీ ఎత్తున హంగుఆర్బాటలతో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ ‘అందమైన’ కార్యక్రమం వెనుక ‘అక్రమాల’ చిత్రం ఉన్న విషయం తాజాగా సమాచార హక్కు దరఖాస్తుకు వచ్చిన సమాధానాల ద్వారా వెల్లడైంది. అయిపోయిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి దాదాపు ఐదు నెలల తర్వాత ప్రభుత్వం బిడ్లు ఆహ్వానించినట్టు తేలింది. ఈ అక్రమాల వ్యవహారంలో సీఎం హిమంత బిశ్వ శర్మ కుటుంబ సన్నిహితుడి కంపెనీకి ప్రభుత్వం నిధులు కేటాయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ ఫ్లైఓవర్కు సంబంధించి ప్రభుత్వం దాదాపు ఐదు నెలల తర్వాత స్థానిక కాంట్రాక్టర్ల నుంచి బిడ్లు ఆహ్వానిస్తూ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్(పీడబ్ల్యూడీ) 2022, మార్చి 9న ప్రకటన ఇచ్చింది. పోస్టు డేటెడ్ వర్క్ ఆర్డర్లను 2022, మే 2న జారీచేశారు. ఈ వ్యవహారంలో నిబంధనలు ఎక్కడా పాటిం చలేదు. పీడబ్ల్యూడీ శాఖ బాధ్యతలు కూడా సీఎం హిమంతనే చూస్తుండటం ఇక్కడ గమనించాల్సిన మరో అంశం.
టెండర్ ఆహ్వానాలకు గువాహటికి చెందిన జేఎంసీ కన్స్ట్రక్షన్ అండ్ సప్లయర్, డ్రీమ్స్ ఏ-మజేతో పాటు అంజన్ శర్మ బిడ్లు వేశారు. ఈ ముగ్గురు బిడ్డర్లు పేర్కొన్న అడ్రస్ గువాహటిలోని ఒకే ఏరియాకు చెందినది కావడం గమనార్హం. అంజన్ శర్మ, ఇతర రెండు కంపెనీల ఓనర్లు జుగానంద శర్మ(జేఎంసీ కన్స్ట్రక్షన్), భాస్కర్ శర్మ(డ్రీమ్స్ ఏ-మజే).. ముగ్గురూ వ్యాపార పార్ట్నర్లనేది మరో వాస్తవం. ప్రారంభోత్సవం ఐదు నెలల తర్వాత టెండర్ల ద్వారా ప్రభుత్వం భాస్కర్ శర్మకు చెందిన డ్రీమ్స్ ఏ-మజే కంపెనీకి మూడు పోస్టు డేటెడ్ వర్క్స్ను మంజూరు చేసినట్టు ఆర్టీఐ సమాధానాల ద్వారా తెలిసింది. సీఎం హిమంత కుటుంబ సభ్యులకు చెందిన వ్యాపారాలతో భాస్కర్ శర్మకు సంబంధాలు ఉన్నాయి.