అయోధ్య, జూలై 1: అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగంపై సిట్ జరుపుతున్న విచారణలో తవ్వే కొద్దీ పలు అక్రమాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా కుంభమేళా సమయంలో భారీగా విరాళాల చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. విరాళాల లెక్కింపులో కోట్ల కొద్దీ అక్రమాలు చోటుచేసుకున్న విషయాన్ని ఇప్పటికే సిట్ బయటకు తీసింది. ప్రస్తుతం ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాలపై వస్తున్న ఆరోపణలపై దృష్టి సారించింది. వీరిద్దరూ ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయోధ్య రామాలయంలో ఇష్టానుసారంగా జరిపిన ఉద్యోగ నియామకాల్లో పలు అక్రమాలు చోటుచేసుకున్నట్లు సిట్ గుర్తించింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, సభ్యుల సిఫార్సు మేరకు పలువురిని అక్రమంగా నియమించినట్లు వెల్లడైంది. కేవలం అనిల్ మిశ్రా సిఫార్సుతోనే 125 మంది ఉద్యోగుల నియామకాలు జరిగాయి. చంపత్ రాయ్, గోపాల్రావుల సన్నిహితులు కూడా ఈ నియామక ప్రక్రియను ప్రభావితం చేశారు.
కుంభమేళా సమయంలోనే భారీగా దోచేశారు!
రామ మందిర విరాళాల కేసు దర్యాప్తులో అయోధ్య పోలీసులు కీలకమైన పురోగతి సాధించారు. గత ఏడాది ఆరంభంలో జరిగిన కుంభమేళా సమయంలో అత్యధికంగా విరాళాల చోరీ జరిగినట్టు వారు వెల్లడించారు. ఆ సమయంలో ఆలయానికి పెద్దయెత్తున పోటెత్తిన భక్తులు భారీగా విరాళాలు సమర్పించారని, రద్దీని ఆసరాగా తీసుకుని ఆ సమయంలో భారీగా అపహరణకు పాల్పడ్డారని తెలిపారు.