‘బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి. ఆ కాంట్రాక్టులను రద్దు చేయండం’టూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2014లో తీర్పునిచ్చింది. అయితే, రద్దు చేయాల్సిన కాంట్రాక్టుల్లో ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీ గ్రూప్నకు చెందిన డీల్స్ కూడా ఉన్నాయి. దీంతో మోదీ సర్కారు చక్రం తిప్పింది. మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (ఎండీవో) కాంట్రాక్ట్ విధానాలను ఏకపక్షంగా సవరించింది. సుప్రీం కోర్టు తీర్పును పక్కనబెట్టి మరీ.. అదానీ కంపెనీలకు బొగ్గు గనుల కాంట్రాక్టులను పునరుద్ధరించింది. కొత్త కాంట్రాక్టులూ కట్టబెట్టింది. ఇది ఉల్లంఘనే అంటూ నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను సైతం దాచిపెట్టింది. దీంతో అదానీ కంపెనీకి 280 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలు సొంతమయ్యాయి. ఈ మేరకు ది రిపోర్టర్స్ కలెక్టివ్ (టీఆర్సీ) మీడియా ఆర్గనైజేషన్ ఓ సంచలన నివేదికను ప్రచురించింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన 204 బొగ్గు గనుల లీజు ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 2014లో ఆయా ఒప్పందాలను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అనంతరం అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు ఒప్పందాలు రైద్దెన బొగ్గు గనులకు మళ్లీ పారదర్శకంగా వేలం ప్రక్రియ నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే, సుప్రీం కోర్టు రద్దు చేసిన బొగ్గు గనుల కాంట్రాక్టుల్లో ప్రధాని మోదీ ఆప్తమిత్రుడు అదానీ కంపెనీలకు చెందిన ఐదు కాంట్రాక్టులు కూడా ఉన్నాయి. దీంతో మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (ఎండీవో) పాలసీలో పలు సవరణలు చేసి అదానీ కాంట్రాక్టులను పునరుద్ధరించింది. కొత్తగా మరో మూడు కాంట్రాక్టులను కట్టబెట్టింది. ఈ మేరకు ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ (టీఆర్సీ) వెలువరించిన సంచలన నివేదికను ఇంగ్లిష్ న్యూస్ వెబ్సైట్ ‘అల్ జజీరా’ ప్రచురించింది.
కుట్ర జరిగింది ఇలా..
2014లో సుప్రీంకోర్టు రద్దు చేసిన బొగ్గు గనుల లీజుల్లో అదానీ కంపెనీలకు చెందిన ఐదు కాంట్రాక్టులు కూడా ఉన్నాయి. ఇందులో మూడు కాంట్రాక్టులు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ కంపెనీలతోనే అదానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్నది. దీంతో అదానీ కంపెనీలకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో కోల్ మైన్స్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ పేరిట ఎండీవో కాంట్రాక్టు పాలసీలో ప్రత్యేక నిబంధనలను కేంద్రం చేర్చింది. 2014 కంటే ముందు ఆయా రాష్ట్రప్రభుత్వాలు ప్రైవేటు కంపెనీలతో కుదుర్చుకొన్న ఎండీవో బొగ్గు గనుల లీజులను అలాగే కొనసాగించవచ్చని, కొత్తగా టెండర్లు పిలవాల్సిన పనిలేదని అందులో పేర్కొన్నది. దీంతో సుప్రీం కోర్టు రద్దు చేసిన కాంట్రాక్టులను అదానీ కంపెనీలు కొనసాగించడానికి మార్గం సుగమమైంది.
ఈ మేరకు టీఆర్సీ వెల్లడించింది. అయితే, ఎండీవో పాలసీలో ఉల్లంఘనలు చోటుచేసుకొన్నాయని క్యాబినెట్ సెక్రటరీకి నీతిఆయోగ్ 2020లో ఓ నివేదికను సమర్పించింది. దీనిపై చర్చించిన ప్రధానమంత్రి కార్యాలయం.. ఎండీవో పాలసీ ద్వారా భవిష్యత్తులో ఎలాంటి కాంట్రాక్టులను అనుమతించబోమని తెలిపింది. అయితే, ఎండీవో పాలసీ ద్వారా అప్పటికే, అదానీ కంపెనీలకు అప్పగించిన 9 (గతంలో 5, ఆ తర్వాత 4) బొగ్గు గనుల లీజులను మాత్రం రద్దు చేయకుండా, కేంద్రం అలాగే కొనసాగించిందని టీఆర్సీ తెలిపింది. ఎండీవో పాలసీలో ఉల్లంఘనలు చోటుచేసుకొన్నాయంటూ నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ను కూడా కేంద్రం ఉద్దేశపూర్వకంగా పబ్లిక్ డొమైన్లో దొరక్కుండా దాచిపెట్టిందని టీఆర్సీ ఆరోపించింది.
ఏమిటీ ఎండీవో?
బొగ్గును వెలికితీయడానికి ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వాలు కాంట్రాక్టులు అప్పగిస్తాయి. అయితే, ఏ ధరకు ఈ లీజు ఫైనల్ అయ్యిందో ఎలాంటి వివరాలు బయటకు రావు. వీటినే మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (ఎండీవో) కాంట్రాక్టులు అంటారు. ఈ ప్రక్రియ పారదర్శకమైనది కాదు. నిబంధనలకు విరుద్ధం.