ఖమ్మం నియోజకవర్గంలో నిర్మానుష్యంగా రహదారులు
నిత్యావసరాల కోసం తెల్లవారుజామునే బయటికొచ్చిన ప్రజలు
దయం 10 గంటల తరువాత దుకాణాలన్నీ మూసివేత
30 శాతం ఉద్యోగులతో తెరుచుకున్న ప్రభుత్వ ఆఫీసులు
స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్న నగర ప్రజలు
ఖమ్మం/ రఘునాథపాలెం, మే 12: రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ తొలిరోజు ఖమ్మం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 10 గంటల తరువాత షాపులన్నీ మూతబడ్డాయి. 30 శాతం ఉద్యోగుల హాజరుతోనే ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. రోడ్లపై పోలీసులు పహారా కాశారు. రద్దీ ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోడ్లపైకి జనం రాకుండా చర్యలు తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమించిన పలువురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అత్యవసర పనుల కోసం వెళ్లేవారికి మినహాయింపునిచ్చారు.
కరోనా మహమ్మారి విజృంభిబిస్తుండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఎవరికి వారు స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం లాక్డౌన్ పెట్టాలని విజ్ఞప్తులు రావడంతో బుధవారం నుంచి ఈ నెల 20 వరకు సీఎం కేసీఆర్ లాక్డౌన్ విధించారు. తొలిరోజు ఖమ్మం నగరంలో లాక్డౌన్ విజయవంతంగా కొనసాగింది.
ఉదయం కిటకిట..
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఇవ్వడంతో నగర వాసుల రాకతో రహదారులు కిటకిటలాడాయి. కిరాణా దుకాణాలు, కూరగాయాల మార్కెట్లు, పండ్ల దుకాణాలు, హోల్సేల్ మార్కెట్లు, పాన్షాపులు, మాంసం దుకాణాలు, మెడికల్ షాపులు, బస్టాండ్లు, ఆటోల అడ్డాలు, వైన్షాపులు, సూపర్ మార్కెట్లు, పెట్రోల్, డీజిల్ బంక్లు, హోటళ్లు తదితర కేంద్రాల వద్ద రద్దీ కనిపించాయి.
నామమాత్రంగానే ప్రభుత్వ కార్యాలయాలు..
లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో ఖమ్మం నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ నామమాత్రంగానే తెరుచుకున్నాయి. కలెక్టరేట్లో ఒక్కో విభాగంలో ఇద్దరు ఉద్యోగులు మినహా పెద్దగా ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. సివిల్ సప్లయీస్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో ఉద్యోగుల సంఖ్య నామమాత్రంగానే ఉంది. జిల్లా పరిషత్లోని పలు విభాగాల కార్యాలయాల తలుపులు తెరుచుకోలేదు. ఇరిగేషన్ కార్యాలయాల పరిస్థితి అలానే ఉంది. డీఆర్డీఏ, జిల్లా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, అటవీశాఖ, విద్యాశాఖ కార్యాలయాల్లో కూడా 33 శాతం కంటే తక్కువ సంఖ్యలో ఉద్యోగులు విధులకు హాజరయ్యారు.
రద్దీగా మాంసం దుకాణాలు..
ఖమ్మం నగరంలోని పలు రహదారులు, సెంటర్ల వద్ద ఉన్న చికెన్, మటన్, చేపల దుకాణాల వద్ద బుధవారం తెల్లవారుజాము నుంచే రద్దీ కనిపించింది. దీంతో వ్యాపారులు చేపల ధరలను పెంచేశారు.
కొత్త బస్టాండ్ వద్ద రద్దీ..
లాక్డౌన్ ఊహాగానాలు రావడంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ముందుగానే వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. అక్కడక్కడా మిగిలిపోయిన ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు వారి కోసం ప్రభుత్వం బుధవారం ఉదయం 10 గంటల వరకు ఆర్టీసీ బస్సులను కొనసాగింది.
ఉదయం 10 తరువాత అంతా నిర్మానుష్యం..
ఉదయం 10 గంటల తరువాత నగర రహదారులన్నీ నిర్మానుష్యమయ్యాయి. తెల్లవారుజామున రోడ్లపైకి వచ్చిన జనమంతా 10 లోపు తమ తమ ఇళ్లల్లో వెళ్లిపోవడంతో రహదారులన్నీ ఖాళీగా దర్శనిమిచ్చాయి. అంబులెన్సులు, పోలీసుల వాహనాలు వంటివి మాత్రమే కన్పించాయి. రఘునాథపాలెం మండలంలో కూడా నిశ్శబ్ద వాతావరణం కన్పించింది. గ్రామాల్లోని ప్రజలెవరూ బయటకు రాలేదు. ప్రధాన కూడళ్లలో పోలీసులు పహారా కాశారు.