Rajdhani Express | రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడికి అందించిన భోజనంలో ఈగ వచ్చిన ఘటనను ఐఆర్సీటీసీ సీరియస్గా తీసుకుంది. సదరు క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా విధించింది. అలాగే లైసెన్స్ రద్దు చేస్తామని షోకాజు నోటీసులు జారీ చేసింది.
అహ్మదాబాద్ నుంచి ముంబైకి తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్లో ఇటీవల ప్రయాణించిన ఓ వ్యక్తి ఆన్బోర్డు భోజనంగా వెజ్ బిర్యానీతో కూడిన కాంబో లంచ్ను ఆర్డర్ చేశాడు. దానిని తినే సమయంలో బిర్యానీలో ఈగ కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన ప్రయాణికుడు వెంటనే రైలు సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. భోజనం నాణ్యత కూడా బాగోలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే రైలు కెప్టెన్, ఆన్బోర్డ్ క్యాటరింగ్ మేనేజర్ ప్రయాణికుడి వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. జరిగిన తప్పుకు క్షమాపణలు చెప్పి కొత్త భోజనం అందిస్తామని ప్రయాణికుడికి చెప్పారు. కానీ అందుకు ప్రయాణికుడు తిరస్కరించాడు. దీనిపై ఐఆర్సీటీసీకి ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేయగా.. అరాహా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న సూరత్లోని లైసెన్స్ పొందిన బేస్ కిచెన్ నుంచి ఆ ఫుడ్ సరఫరా అయినట్లుగా అధికారులు గుర్తించారు. అందులో భోజనం తయారీతో పాటు, ప్యాకేజింగ్ ప్రక్రియలో పలు లోపాలు ఉన్నట్లు గమనించారు. ఈ నేపథ్యంలో సదరు క్యాటరింగ్ సంస్థకు ఐఆర్సీటీసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే సరిదిద్దే చర్యలు చేపట్టాలని ఆదేశించింది.