Ayatollah Ali Khamenei : ఇరాన్ దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా ఖమేని అంత్యక్రియలు మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ అంత్యక్రియలకు బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఇరాన్ ఆహ్వానించింది. ఈ నెల 4న ఖమేని అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ప్రధాన కార్యక్రమాలు జూలై 5 నుంచి 9 వరకు జరుగుతాయి. గత ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా జరిపిన దాడిలో అయతొల్లా ఖమేని (86)తోపాటు పలువురు అతడి కుటుంబ సభ్యులు మరణించిన సంగతి తెలిసిందే.
ఖమేనితోపాటు మిగతావారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇరాన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీగా ఈ అంత్యక్రియల్ని నిర్వహించబోతుంది. దీనిలో భాగంగా వివిధ దేశాలకు చెందిన అధినేతలు, ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తోంది. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇరాన్ ఆహ్వానం పలికింది. ఖమేని అంత్యక్రియలకు మోదీ రావాలని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కోరారు. అయితే, వివిధ కారణాల రీత్యా మోదీ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. కానీ, ఇరాన్ ఆహ్వానాన్ని మన్నించి ఇండియా తరఫున ప్రతినిధులను ప్రభుత్వం అధికారికంగా పంపించనుంది. ఇండియా తరఫున కేంద్ర మంత్రి పవిత్రా మార్గెరిటా, బిహార్ గవర్నర్ సయ్యద్ అటా హస్నైన్ హాజరుకానున్నారు. ఇదే సమయంలో తాజాగా బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను కూడా ఇరాన్ ఆహ్వానించింది. వీరు ఇరాన్ వెళ్లడంపై ఇంకా స్పష్టత లేదు.
ఇక, ఈ అంత్యక్రియలు దాదాపు ఆరు రోజులు జరుగుతాయి. ముందుగా నివాళులు అర్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూలై 9న అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఈ కార్యక్రమాలకు దాదాపు 12 మిలియన్ల నుంచి 20 మిలియన్ల వరకు ప్రజలు హాజరవుతారని ఇరాన్ అంచనా. దీనికి అనుగుణంగా ఇరాన్ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. రవాణా, వైద్యపరమైన ఏర్పాట్లతోపాటు ట్రాఫిక్ ఆంక్షలు వంటివాటిని పర్యవేక్షిస్తోంది. దేశ చరిత్రలో నిలిచిపోయేలా ఈ అంత్యక్రియలు జరపాలని ఇరాన్ ప్రభుత్వం నిర్ణయించింది.