అయోధ్య, జూలై 18: అయోధ్యలోని రామ మందిర దైనందిన కార్యకలాపాలతో సంబంధం ఉన్న వారినందరినీ పోలీసులు విచారిస్తుండడంతో ఆలయానికి చెందిన విరాళాల చోరీ కేసు దర్యాప్తు పరిధి మరింత విస్తృతమైంది. ఇప్పటి వరకు ఈ కేసులో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆలయంలో భక్తులు సమర్పించిన కరెన్సీ నోట్లను లెక్కించే పనిలో దాదాపు 50 మంది నిమగ్నమయ్యారని, వీరిని ట్రస్ట్ నిర్వాహకులు లేదా వారికి సన్నిహితంగా ఉండేవారి సిఫార్సుల మేరకు నియమించారని పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇప్పుడు వారి నేపథ్యాలు, తెలిసిన ఆదాయ వనరులకు మించిన ఆస్తులు ఉండే అవకాశం, అలాగే ట్రస్ట్ కార్యకలాపాలతో సంబంధం ఉన్న కొందరు సీనియర్ ట్రస్ట్ నిర్వాహకులు, ప్రభుత్వ అధికారుల పాత్రపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ట్రస్ట్ చేపట్టిన నిర్మాణాలు, భూ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కూడా ఈ దర్యాప్తు పరిధిలోకి వస్తాయని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.