Mehul Choksi | పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) రూ.13వేలకోట్ల కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ (Mehul Choksi)పై ఉన్న రెడ్కార్నర్ (Red Corner notice) నోటీస్ను ఇంటర్ పోల్ (Interpol) ఎత్తివేసింది. ఫ్రాన్స్లోని లియోన్లో ఉన్న ఇంటర్ పోల్ ప్రధాన కార్యాలయంలో చోక్సీ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ మేరకు ఇంటర్పోల్ నిర్ణయం తీసుకున్నది. తనపై రెడ్ నోటీసు జారీ చేయాలన్న సీబీఐ అభ్యర్థనను సవాల్ చేశారు. ఇది రాజకీయ కుట్రగా అభివర్ణించారు. అలాగే పిటిషన్లో భారతదేశంలోని జైలులో పరిస్థితి, తన వ్యక్తిగత భద్రత, ఆరోగ్యం తదితర అంశాలను లేవనెత్తారు. చోక్సీ పిటిషన్ తర్వాత ఈ వ్యవహారం ఐదుగురు సభ్యుల ఇంటర్ పోల్ కమిటీ కోర్టుకు వెళ్లింది. ఈ కమిటీని కమిషన్ ఫర్ కంట్రోల్ ఫైల్స్ అని కూడా పిలుస్తారు. విచారణ అనంతరం రెడ్ నోటీసును కమిటీ రద్దు చేసింది.
ఇంటర్పోల్ అనేది అప్పగింత, లొంగుబాటు, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వ్యక్తిని నిర్బంధించేందుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న సంస్థ. ఇందులో 195 మంది సభ్యులుండగా.. సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లోని విచారణ సంస్థలతో సంబంధాలుంటాయి. అదే సమయంలో కలిసి పని చేస్తుంది. అందుకే విదేశాలకు పారిపోయిన నేరస్తులను పట్టుకోవడానికి ఇంటర్పోల్ సహాయం తీసుకుంటారు. 2018లో చోక్సీకి ఇంటర్పోల్ రెడ్ నోటీసు జారీ చేసింది. భారత్ నుంచి పారిపోయిన దాదాపు పది నెలల తర్వాత రెడ్కార్నర్ నోటీసులను ఇంటర్పోల్ జారీ చేసింది. అదే ఏడాది చోక్సీ ఆంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్న విషయం తెలిసిందే.
భారత్ నుంచి పారిపోయి ఆంటిగ్వాకు చేరుకున్నా మెహుల్ చోక్సీ 2021, మేలో అంటిగ్వా అండ్ బార్బుడాలో అదృశ్యమయన్నారు. ఆ తర్వాత మూడు నాలుగు రోజల తర్వాత పొరుగనే ఉన్న డొమినికాలో ప్రత్యక్షమయ్యారు. దేశంలోకి అక్రమంగా చొరబడ్డారనే అభియోగాలపై అదుపులోకి తీసుకున్నారు. డొమినికాలో చోక్సీ చిక్కిన వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత ఇంటర్ పోల్ రెడ్ నోటీసు ఆధారంగా చోక్సీని తిరిగి భారత్కు తరలించేందుకు సీబీఐ ప్రయత్నాలు చేసింది. అధికారుల బృందం అక్కడికి వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. వజ్రాల వ్యాపారి న్యాయవాదులు డొమినికా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 50రోజులకుపైగా జైలు శిక్ష అనుభవించిన చోక్సీ 2021 జూలైలో విడుదలయ్యారు.
మెహుల్ చోక్సీ.. మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి ముంబయిలోని బ్రాడీ హౌస్ బ్రాంచ్ అధికారులతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.14వేలకోట్లకుపైగా టోకరా వేసినట్లు ఆరోపణలున్నాయి. 2018 నుంచి నకిలీ లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్స్ (LoU) ద్వారా విదేశీ ఖాతాలకు నగదు బదిలీ బదిలీ చేశారనే విమర్శలున్నాయి. ఈ కుంభకోణంలో సీబీఐ మెహుల్ చోక్సీతో పాటు నీరవ్ మోదీపై సీబీఐ చార్జీషీట్లు దాఖలు చేసింది. నీరవ్ మోదీ లండన్కు పారిపోగా.. మెహుల్ చోక్సీ ఆంటిగ్వా పౌరసత్వం తీసుకొని అక్కడికి పారిపోయాడు. ఈ కుంభకోణంపై సీబీఐ ఇంకా దర్యాప్తు చేస్తున్నది.