చెన్నై, జనవరి 23: ఐఏఎస్(క్యాడర్) రూల్స్-1954కు కేంద్రం సవరించిన ప్రతిపాదనలను అన్ని రాష్ర్టాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. ఇది రాష్ర్టా ల అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అని విమర్శిస్తున్నాయి. ఈ సవరణలను ఉపసంహరించుకోవాలని కోరుతూ తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరాయి విజయన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఐఏఎస్ల డిప్యుటేషన్పై కేంద్రం చేసిన సవరణలు రాష్ర్టాలకు ఉన్న స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తాయని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతాన్ని కలిగిస్తాయని తెలిపారు. 75 ఏండ్లుగా దేశం నిర్మించుకొన్న విలువలను ఈ సవరణలు బలహీనం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఏదైనా కూల్చివేయడం సులభం. తిరిగి నిర్మించడం కష్టం. చాలా దీర్ఘకాల ప్రక్రియ’ అని స్టాలిన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
రాష్ర్టాలతో చర్చించండి
దేశంలో సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు కేంద్రప్రభుత్వం రాష్ర్టాలతో చర్చలు జరపాలని స్టాలిన్ కోరారు. రాష్ట్రంలో విధానాల రూపకల్పన సహా అనేక కేంద్ర పథకాలను రాష్ట్ర స్థాయిలో అమలు చేయడంలో ఐఏఎస్లు కీలకం అని, ఐఏఎస్లను బలవంతంగా డిప్యుటేషన్పై పంపాలని కోరడం పథకాల అమలుపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. రాష్ర్టాలు కూడా ఐఏఎస్ల కొరతను ఎదుర్కొంటున్నాయన్నారు. ముఖ్యంగా కొన్ని సీనియర్ పోస్టుల్లో అధికారుల్లేరని పేర్కొన్నారు. కేంద్రం అనుసరిస్తున్న క్యాడర్ మేనేజ్మెంట్ విధానాల్లో తప్పుల వల్లే ఇలా జరుగుతున్నదని విమర్శించారు.
ఐఏఎస్లలో భయం
ఐఏఎస్ క్యాడర్ రూల్స్కు చేసిన సవరణలు రాష్ర్టాల్లో పాలనా వ్యవహారాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని విజయన్ లేఖలో పేర్కొన్నారు. అధికారుల్లో భయాందోళనను సృష్టిస్తాయని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాకుండా ఏదైనా రాష్ట్రంలో వేరే పార్టీ అధికారంలో ఉంటే.. ఆ రాష్ట్రంలో విధానాల రూపకల్పన, పథకాలను సమర్థంగా అమలు చేయడంలో ఐఏఎస్లు సంకోచించే పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నారు. ఐఏఎస్లను రాజకీయ క్రీడలో భాగస్వాములను చేయవద్దని విజయన్ కోరారు.