న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: పెట్రో ధరల పెంపు నెపాన్ని విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై నెట్టేస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పెట్రోల్పై ఎడాపెడా పన్నులను పెంచుతున్న కేంద్రం.. రాష్ర్టాలను ట్యాక్సులు తగ్గించాలని కోరడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే తూర్పారబట్టారు. ఈ వ్యాఖ్యలు చేయడానికి ప్రధానికి సిగ్గు, ఎగ్గు ఉండాలంటూ బుధవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదని స్పష్టంచేశారు. తాజాగా గురువారం ఇతర విపక్ష పాలిత రాష్ర్టాల సీఎంలు కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పెట్రో ధరల అంశం కేంద్రం, రాష్ర్టాల మధ్య యుద్ధాన్ని తలపిస్తున్నది.
పళ్లెంలో గుమ్మడికాయ దాచినట్టు..
పళ్లెంలోని అన్నంలో పెద్ద గుమ్మడికాయను దాచిన చందంగా మోదీ మాట్లాడుతున్నారు. కేం ద్రం పన్నులు పెంచిన ప్రతీసారి తమిళనాడు ట్యాక్సులను తగ్గిస్తూనే ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ, కేంద్రం పెట్రోల్ రేట్లు తగ్గించలేదు. ఎన్నికల ముందు పెట్రో రేట్లను స్థిరంగా ఉంచిన మోదీ సర్కారు.. అనంతరం ధరలను మళ్లీ పెంచింది. ఇది అందరికీ తెలుసు.
-తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
ఆర్థిక నిర్వహణ కేంద్రం బాధ్యత
పెట్రోరేట్లు పెరుగడానికి కొన్ని రాష్ర్టాలే కారణమని నిందించడం సమాఖ్య వ్యవస్థలో సరికాదు. పెట్రో ధరల పెంపును రాష్ర్టాలపై నెట్టివేయడం వల్ల సామాన్యుల ఆర్థిక కష్టాలు ఏ మాత్రం తీరిపోవు. దేశ ఆర్థిక నిర్వహణ కేంద్రం బాధ్యత. ప్రజా సంక్షేమానికి అత్యధిక నిధులను ఖర్చుచేస్తున్న కేరళపై ఈ తరహా నిందలు సరికాదు. గడిచిన ఆరేండ్లలో పెట్రోల్పై సేల్స్ట్యాక్స్ను ఒక్కసారి కూడా మేము పెంచలేదు.
-కేరళ సీఎం పినరాయి విజయన్
బుల్డోజర్లతో పడగొట్టకండి
ఇంధన సబ్సిడీ కోసం గడిచిన మూడేండ్లలో బెంగాల్ ప్రభు త్వం రూ. 1500 కోట్లు ఖర్చు చేసింది. కేంద్రం నుంచి బెంగాల్కు రూ. 97 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నది. పెట్రోల్ అంశంపై మోదీ చెప్పినవన్నీ అబద్ధాలే. బీజేపీ పాలిత రాష్ర్టాలకే కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తున్నది. ధరలను అదుపులో పెట్టడానికి కేంద్రం ఏ చర్యలు తీసుకొంటున్నది? రాష్ర్టాలపై నిందలు వేస్తూ ప్రజాస్వామ్యాన్ని బుల్డోజర్లతో పడగొట్టకండి.
-బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
ఏది పెరిగినా రాష్ర్టాలనే నిందిస్తారా?
దేశంలో ఇంధన ధరలు పెరిగినా, బొగ్గు కొరత ఏర్పడినా, ఆక్సిజన్ కొరత ఏర్పడినా రాష్ర్టాలనే నిందించడం కేంద్రం పనిగా పెట్టుకొన్నది. పెట్రోల్పై వచ్చే పన్ను వసూళ్లలో 68 శాతాన్ని కేంద్రమే తీసుకొంటున్నది. అయితే, ధరల పెరుగుదల అపవాదును మాత్రం రాష్ర్టాలపై నెట్టేస్తున్నది. మోదీ సమాఖ్యస్ఫూర్తి మంత్రం సహకారయుతంగా లేదు. రాష్ర్టాలను బెదిరించే ధోరణితో కొనసాగుతున్నది. ఇది ఎంతమాత్రం మంచిది కాదు.
-కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీ
చరిత్రలోనే రికార్డు ఆదాయం
పెట్రోల్, డీజిల్పై ఎడాపెడా పన్నులతో చరిత్రలో ఎన్నడూ లేనంతగా కేంద్ర ప్రభుత్వం ఆదాయాన్ని దండుకొన్నది. గడిచిన 8 ఏండ్ల లో పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పేరిట మోదీ సర్కారు రూ. 26 లక్షల కోట్లు ఆర్జించింది. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ పేరు చెప్పబోయి.. మోదీ పొరపాటున జైపూర్ పేరు చెప్పారు. నిజానికి జైపూర్తో పోలిస్తే, భోపాల్లో పెట్రోల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి.
-రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
ప్రధానికి ఎందుకు చెప్పలేదు?
రాష్ర్టాలకు రావాల్సిన జీఎస్టీ బకాయిలు రూ. 78,704 కోట్లు పెండింగ్లోనే ఉన్నాయని ఆర్థికమంత్రిత్వ శాఖ బుధవారం తెలియజేసింది. సెస్ ఫండ్లో కావాలసిన నిధులు లేకపోవడంతోనే బకాయిలు చెల్లించలేకపోతున్నట్టు చెప్పింది. అయితే, అదేరోజు ప్రధాని.. పెట్రో అంశంపై విపక్ష పాలిత రాష్ర్టాలను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నప్పుడు.. బకాయిల విషయాన్ని ఆర్థికశాఖ ఆయనకు ఎందుకు చెప్పలేదు.
-కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం
మద్యంపై బదులు పెట్రోల్పై ట్యాక్సులు తగ్గించండి
విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలు దిగుమతి చేసుకొంటున్న మద్యంపై పన్నులను తగ్గించడానికి బదులు.. పెట్రోల్పై ట్యాక్సులను తగ్గించాలి. అప్పుడు ఇంధన ధరలు దిగొస్తాయి. -పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి