న్యూఢిల్లీ, జూలై 23: 6 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేసేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనున్నది. అలాగే అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో వారికి ప్రత్యేకంగా టాయిలెట్ సౌకర్యం ఉండేలా చూడాలన్న దానిపైనా విచారణ జరగనున్నది. సామాజిక కార్యకర్త జయా ఠాకూర్ వేసిన ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్లు జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారించనున్నది. స్కూలు విద్యార్థినుల ‘రుతుక్రమ ఆరోగ్యానికి’ సంబంధించి అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు అనుసరించేలా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్వోపీ)తోపాటు జాతీయ నమూనాను సిద్ధం చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఇటీవల కేంద్రాన్ని ఆదేశించింది. దీనిని అతి ముఖ్యమైన విషయంగా పరిగణించాలని కోరింది.