న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ప్రజల ప్రాణాలను బలి గొంటున్న కలుషిత నీటి సమస్య బీజేపీ పాలిత రాష్ర్టాలైన మధ్యప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీలలో తీవ్ర దుమారానికి దారి తీసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత మంచి నీళ్లు తాగి ప్రజలు మరణించిన ఘటన గురువారం అసెంబ్లీలో తీవ్ర రభసకు దారి తీసింది. ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక జవాబుకు, మంత్రి చేసిన ప్రకటనకు మధ్య పొంతన లేకపోవడంపై విపక్ష కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఇండోర్లో డయేరియా వ్యాధి వల్ల 20 మంది మరణించారు. అయితే విపక్ష కాంగ్రెస్ మాత్రం కలుషిత నీటి కారణంగా 35 మందికిపైగా మరణించినట్లు ఆరోపించింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించి మున్సిపల్ మంత్రి కేలాష్ విజయ్ వర్గీయ, ఆరోగ్య మంత్రి రాజీనామా చేయాలని అసెంబ్లీ విపక్ష నాయకుడు ఉమంగ్ సింఘర్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్న కలుషిత నీటి సమస్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేష్ పర్మర్, అసెంబ్లీ స్పీకర్ శంకర్ చౌదరికి మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వాదం చెలరేగింది. రసాయనాలు కలిసిన కలుషిత నీరు ఉన్న సీసాను పర్మర్ సభలో చూపడంతో స్పీకర్ ఆగ్రహం ప్రకటించారు. మంచి నీళ్లు కలుషితం కాలేదన్న ప్రభుత్వ వాదనలు తప్పని ఈ నీరే నిరూపిస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మరోవైపు మషీసాగర్ జిల్లాలోని జమియత్పురాలో మౌర్య ఎన్విరో ప్రాజెక్ట్స్కు చెందిన వ్యర్థాల శుద్ధ ప్రదేశం వల్ల చుట్టుపక్కల భూగర్భ జలాలు రసాయనాలతో కలుషితం అయ్యాయని కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు తుషార్ చౌదరి చేసిన ఆరోపణలతో సభలో వేడిగా చర్చ జరిగింది.
రేఖా గుప్తా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది గడిచినా ఢిల్లీ మహిళలకు ప్రతి నెలా రూ.2,500 మాత్రం ఇంకా అందలేదు. బీజేపీ ఢిల్లీ ప్రచారంలో సమృద్ధి యోజన కేంద్ర బిందువుగా నిలిచింది. తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన 21-60 సంవత్సరాల వయసు గల మహిళల ఖాతాలో రూ.2,500 జమ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ హామీ ఇచ్చింది. దీనిని మోదీ హామీగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మొదటి క్యాబినెట్ సమావేశం తర్వాత మహిళల ఖాతాల్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుందని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి గడువు తేదీన తన మాటను ఆమె నిలబెట్టుకోలేకపోయారు.
ఈ పథకం లబ్ధిదారులతో న్యూస్లాండ్రీ మాట్లాడగా మహిళలకు డబ్బు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని, ఆయనకే తాము ఓటువేశామని పట్పట్గంజ్ ప్రాంతంలోని టీ-క్యాంపునకు చెందిన సమీనా అనే మహిళ చెప్పారు. ఇంకా దబ్బు తమ ఖాతాలో పడలేదని ఆమె తెలిపారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ మాట్లాడుతూ ఈ పథకం పనులు జరుగుతున్నాయని, కమిటీల ఏర్పాటు పూర్తయిందని చెప్పారు. ఇంకా క్షేత్రస్థాయిలో పథకం అమలు జరగలేదని ఆయన వివరించారు.