న్యూఢిల్లీ: ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన ఇండిగో విమానం (IndiGo Plane) ట్యాక్సీవే మిస్ అయ్యింది. రన్వే చివర వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ రన్వేను కొంతసేపు బ్లాక్ చేశారు. ఈ సంఘటన వల్ల పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. అమృత్సర్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఇండిగో విమానం ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. అయితే చల్లని వాతావరణం వల్ల ముందు ఉన్నవి సరిగా కనిపించకపోవడంతో ఎయిర్పోర్ట్ బే వైపు వెళ్లాల్సిన ట్యాక్సీవేలోకి ఆ విమానాన్ని పైలట్ తీసుకెళ్లలేదు. దీంతో ట్యాక్సీవే దాటిన ఆ విమానం రన్వే చివరి వరకు వెళ్లి ఆగింది.
కాగా, ఈ విషయాన్ని గమనించిన ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. 15 నిమిషాలపాటు ఆ రన్వేను మూసివేశారు. ఒక వాహనం ద్వారా ఆ విమానాన్ని పార్కింగ్ బే వద్దకు తీసుకొచ్చారు. ఈ సంఘటన వల్ల పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతరం ఆ ఎయిర్పోర్ట్లో సాధారణ పరిస్థితి నెలకొన్నది. ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యంపై విచారం వ్యక్తం చేసింది.