విమానం ఆలస్యం కావడంతో ఇండిగో కో పైలట్పై ఓ ప్రయాణికుడు చేయి చేసుకోవడం రెండు రోజుల నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోపైలట్పై ఓ ప్రయాణికుడు దాడి చేస్తున్న వీడియో వైరల్ కావడంతో.. ఈ ఘటనపై చాలామంది సీరియస్ అయ్యారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. హనీమూన్కు లేట్అవుతుండటంతో ఆపుకోలేకనే సదరు ప్రయాణికుడు ఇలా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
వివరాల్లోకి వెళ్తే.. దట్టమైన పొగమంచు కారణంగా ఇటీవల ఉదయం వెళ్లాల్సిన చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానం 6E-2175 కూడా ఆలస్యంగా బయల్దేరింది. ఉదయం 7.40 గంటలకు వెళ్లాల్సిన విమానం పొగమంచు కారణంగా మధ్యాహ్నం 3 గంటలు అయినా ఎయిర్పోర్టు నుంచి కదల్లేదు. డీజీసీఏ నిబంధనల ప్రకారం.. తన టైమింగ్స్ ముగియడంతో అప్పటిదాక డ్యూటీలో ఉన్న పైలట్లు దిగిపోయారు. కొత్త పైలట్లు డ్యూటీలోకి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కొత్తగా డ్యూటీలోకి వచ్చిన పైలట్.. విమానం బయల్దేరడానికి మరో గంట సమయం పడుతుందని ప్రకటించాడు.
ఇటీవల వివాహం చేసుకున్న సాహిల్ కటారియా అనే వ్యక్తి హనీమూన్కు గోవా వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాడు. అతను కూడా అదే విమానం ఎక్కాడు. అయితే ఉదయం 7.40 గంటలకు బయల్దేరాల్సిన విమానం మధ్యాహ్నం 3 గంటల వరకు బయల్దేరకపోవడంతో చాలా అసహనానికి గురయ్యాడు. కొత్త భార్యతో సరదాగా ఎంజాయ్ చేయాలని ఎన్నో కలలు కన్న అతనికి.. రోజంతా విమానంలోనే గడిచిపోతుండటంతో చిర్రెత్తుకొచ్చింది. అసలే తన ప్లాన్ మొత్తం బెడిసికొట్టిందనే అవేశంలో ఉండగా.. పైలట్ వచ్చి విమానం బయల్దేరడానికి ఇంకో గంట ఆలస్యం అవుతుందని చెప్పడంతో తట్టుకోలేకపోయాడు. ఆ ఫ్రస్ట్రేషన్లోనే వెనుక సీటులో కూర్చున్న సాహిల్ కటారియా పరుగెత్తుకుంటూ వచ్చి పైలట్పై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.