IndiGo Flight : వడోదర (Vadodara) నుంచి ఢిల్లీ (Delhi) కి బయలుదేరిన ఇండిగో విమానం (IndiGo) లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టేకాఫ్కు ముందే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎయిర్ కండిషనింగ్ (AC) వ్యవస్థ పనిచేయలేదు. దాంతో దాదాపు అరగంటకుపైగా ప్రయాణికులు తీవ్రమైన వేడి, ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఈ ఘటన వడోదర విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
Power failure on IndiGo 6E 657 at Vadodara Airport: Passengers stuck without AC, lights or ventilation for ~30 mins on ground.
Chaos inside! pic.twitter.com/6rrlXg2JhX
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 18, 2026
వివరాల్లోకి వెళ్తే.. 6E 657 నంబర్ ఇండిగో విమానం వడోదర నుంచి న్యూఢిల్లీకి బయలుదేరేందుకు సిద్ధమైంది. ప్రయాణికులు ఎక్కిన తర్వాత విమానం టార్మాక్పై ఉండగానే ఏసీ వ్యవస్థ ఆగిపోయింది. విమానం డోర్లు మూసి ఉండటంతో గాలి కూడా రాక లోపల ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోయింది. దాంతో చిన్నారులు, వృద్ధులు సహా ప్రయాణికులంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
గ్రౌండ్ పుష్బ్యాక్ సిస్టమ్లో సాంకేతిక లోపం తలెత్తడమే ఈ సమస్యకు కారణమని ప్రయాణికులు చెప్పారు. దాన్ని సరిచేసేందుకు ప్రత్యామ్నాయ పరికరాలు వెంటనే అందుబాటులో లేవని, ఎయిర్పోర్ట్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. విమాన సిబ్బంది నుంచి సరైన సమాచారం రాకపోవడంతో ప్రయాణికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఇండిగో సంస్థ స్పందించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపింది.