న్యూఢిల్లీ, మే 27 : పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఏర్పడిన ఇంధన ధరల సెగ మన దేశ వైమానిక రంగానికి కూడా సోకింది. ఇటీవల విమాన ఇంధన ధరలు పెరిగిపోవడంతో వస్తున్న నష్టాలు, తక్కువ డిమాండ్ తదితర కారణాలతో దేశీయ మార్గాల్లోని విమాన సర్వీసుల్లో తాత్కాలికంగా కోత విధించాలని ఎయిర్ ఇండియా, ఏఐ ఎక్స్ప్రెస్, ఇండిగో నిర్ణయించాయి. రానున్న నెలల్లో ఈ విమానయాన సంస్థలు 10 నుంచి 22 శాతం దేశీయ రూట్లలోని విమానాలను తగ్గించనున్నాయి. ఎయిరిండియా జూన్, జూలై నెలల్లో 20-22 శాతం, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ జూన్లో 10 శాతం, ఇండిగో సెప్టెంబర్ త్రైమాసానికి 12-15 శాతం దేశీయ విమాన సర్వీసుల్లో కోత విధించనున్నాయి.
జెట్ ఫ్యూయల్ ధరల పెరుగుదల, గగనతల ఆంక్షలు కారణాలతో టాటాకు చెందిన ఎయిరిండియా రెండు వారాల క్రితమే తన 27 శాతం అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు ఆ తగ్గింపును దేశీయ విమాన రూట్లకు కూడా వర్తింప చేయనుంది. విమాన ఇంధన ధరలు ఇటీవల బాగా పెరగడంతో నిర్వహణ వ్యయం అధికమైందని, దానిని నియంత్రించేందుకు తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా వారానికి 4,400 విమానాలు నడుపుతుండగా, అందులో 3,600 దేశీయ, 800 అంతర్జాతీయ రూట్లలో నడుస్తున్నాయి. ఇండిగో సంస్థ 1,950 విమానాలను ప్రతిరోజూ నిర్వహిస్తున్నది. దీంతో విమానాల రద్దు ప్రభావం వచ్చే రెండు నెలల్లో ప్రయాణికులపై తీవ్రంగానే పడే అవకాశం ఉంది.