న్యూఢిల్లీ: కరోనా నూతన వేరియంట్ దేశంలో కలకలం సృష్టిస్తున్నది. మహమ్మారి సరికొత్త రూపం వేగంగా విస్తరిస్తుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఆదివారం మహారాష్ట్రలో ఆరు, గుజరాత్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 153కు చేరింది.
అధికారిక గణాంకాల ప్రకారం 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 54, ఢిల్లీలో 22, రాజస్థాన్లో 17, కర్ణాటకలో 14, తెలంగాణ 20, గుజరాత్ 11, కేరళ 11, ఆంధ్రప్రదేశ్ 1, చండీగఢ్ 1, తమిళనాడు 1, పశ్చిమబెంగాల్లో 1 చొప్పున రికార్డయ్యాయి.
ఈ కొత్త వేరియంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. గతంలో బయటపడిన డెల్టా కంటే ఒమిక్రాన్ ఎంతో స్పీడ్గా వ్యాప్తి చెందుతున్నదని తెలిపింది. ఇప్పటికే 90కిపైగా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది. ఒమిక్రాన్ (Omicron) వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా నిబంధనలు పాటించాలని పేరొన్నది. వీలైంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవలని సూచించింది.