న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరం చేసే దిశగా భారీ ముందడుగు పడింది. డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా అర్హులైన జనాభా అంతటికీ కనీసం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు అందించాలనే లక్ష్యం నెరవేరేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇక అక్టోబర్ నుంచి భారత్కు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ తొలి డోసుల సరఫరా ప్రారంభం కానుంది.
తొలివిడతలో 4.35 కోట్ల జాన్సన్ సింగిల్ డోస్ టీకాలతో కూడిన షిప్మెంట్ దేశానికి చేరుకోనుందని సమాచారం. అక్టోబర్లో 30 కోట్ల టీకా డోసుల పంపిణీ చేపట్టాలన్న లక్ష్యం చేరుకునేందుకు జాన్సన్ టీకాల రాక ప్రభుత్వానికి ఉపకరించనుంది. ఇక దేశీయంగా వ్యాక్సిన్ల కొరత తీరడంతో వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం కింద అక్టోబర్ నుంచి టీకాల ఎగుమతిపైనా ప్రభుత్వం దృష్టిసారిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ఇటీవల పేర్కొన్నారు.