Manipur Violence | ఇంఫాల్/న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఇంకా రగులుతూనే ఉన్నది. హింసాత్మక ఘటనలు చెలరేగి నాలుగు నెలలకు పైగా గడిచినా, నేటికీ రాష్ట్రంలో పరిస్థితులు సద్దుమణగడం లేదు. ప్రతి రోజు ఎక్కడో చోట హింస కొనసాగుతూనే ఉన్నది. మణిపూర్లో హింస మొదలైన మే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 175 మంది వరకు మరణించారని, 1,108 మంది గాయపడ్డారని రాష్ట్ర పోలీసులు వెల్లడించారు. 96 గుర్తు తెలియని మృతదేహాలు ఇంకా మార్చురీల్లోనే ఉన్నాయని తెలిపారు. అయితే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని స్థానిక పౌర సంఘాలు చెబుతున్నాయి. ఇంఫాల్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐజీపీ(ఆపరేషన్స్) ఐకే మయివా మాట్లాడుతూ హింసలో 32 మంది అదృశ్యమయ్యారని తెలిపారు. 5,172 నిప్పంటించిన ఘటనలు చోటుచేసుకొన్నాయని, 4,786 ఇండ్లు ఆహుతయ్యాయని, 386 ప్రార్థనా స్థలాలు ధ్వంసం అయ్యాయని వెల్లడించారు. హింసకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 9,332 కేసులు నమోదయ్యాయని, 325 మందిని అరెస్టు చేశామని తెలిపారు.
అస్సాం రైఫిల్స్ను ఉపసంహరించాలి
మణిపూర్ నుంచి అస్సాం రైఫిల్స్ బలగాలను ఉపసంహరించాలని రాష్ర్టానికి చెందిన కోఆర్డినేటింగ్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ(సీవోసీవోఎంఐ-కొకొమీ) రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను డిమాండ్ చేసింది. అస్సాం రైఫిల్స్ బలగాలు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మైతీ గ్రూపులకు ప్రాతినిథ్యం వహించే కొకొమీ ఆరోపించింది. గురువారం వారు ఈ మేరకు రాజ్నాథ్కు మెమోరాండం సమర్పించారు. మరోవైపు రాష్ట్ర పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కుకీ సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం నుంచి అస్సాం రైఫిల్స్ను ఉపసంహరించొద్దని, ఇది గిరిజనుల భద్రతకు విఘాతం కలిగిస్తుందని పేర్కొంటూ గత నెల 10 మంది కుకీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రధాని మోదీకి లేఖ రాశారు.
నివేదిక ఇవ్వడం నేరమెలా అవుతుంది?
మరోవైపు మణిపూర్ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో నలుగురు ఎడిటర్స్ గిల్డ్ ఈజీఐ(ఈజీఐ) సభ్యులకు సుప్రీంకోర్టు అరెస్టు నుంచి రక్షణను పొడిగించింది. సంబంధిత కేసుల్లో వారిని మరో రెండు వారాల పాటు అరెస్టు చేయొద్దని పోలీసులను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. ఈ సందర్భంగా ఈజీఐ నిజనిర్ధారణ కమిటీ నివేదికపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘క్షేత్రస్థాయిలో పర్యటించాకే కమిటీ నివేదిక ఇచ్చింది. నివేదిక పక్షపాతంగా ఉన్నదని ప్రభుత్వం చెబుతున్నది. అది కరెక్టా కాదా అన్నది పక్కనపెడితే.. ఇది భావప్రకటనాస్వేచ్ఛ కదా’ అని కోర్టు పేర్కొన్నది.