ముంబై, జనవరి 12: మహారాష్ట్రలో నిర్మితమైన దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెనను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. 21.8 కిలోమీటర్ల పొడవుండే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(ఎంటీహెచ్ఎల్) ముంబైలోని సేవ్రి, రాయగఢ్ జిల్లాలోని నవా శేవాను కలుపుతుంది. రూ.17,840 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయీ పేరుమీదుగా ‘అటల్ సేతు’ అని నామకరణం చేశారు.
రెండు పాయింట్ల మధ్య ప్రస్తుతం ఉన్న గంటన్నరగా ఉన్న ప్రయాణ సమయం ఈ వంతెన ద్వారా 20 నిమిషాలకు తగ్గుతుంది. ఆరు లైన్లతో నిర్మించిన ఈ బ్రిడ్జి.. 16.5 కిలోమీటర్లు సముద్రం మీదుగానే వెళ్తుంది. బ్రిడ్జి ద్వారా ముంబై, నవీ ముంబై మధ్య దూరం, ప్రయాణ సమయం మరింత తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ వంతెనపై ఓపెన్ రోడ్ టోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాహనదారులు టోల్ బూతుల వద్ద ఆగకుండానే 100 కిలోమీటర్ల వరకు వేగంతో వెళ్లిపోవచ్చు.