తిరువనంతపురం : మంకీపాక్స్ భారత్కు విస్తరించింది. ఈ మహమ్మారి తొలికేసు కేరళలో నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ ధ్రువీకరించారు. ఈ నెల 12న యూఏఈ నుంచి తిరువనంతపురానికి వచ్చిన కొల్లాంకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. సదరు వ్యక్తికి లక్షణాలు కనిపించడంతో నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా.. పాజిటివ్గా తేలింది.
ఇప్పటికే సదరు వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించినట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 12న తిరువనంతపురానికి వచ్చిన బాధితుడు తొలుత ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అనంతరం అక్కడి నుంచి తిరువనంతపురం మెడికల్ కాలేజీకి వెళ్లగా.. అనుమానంరావడంతో నమూనాలను సేకరించి పుణేలోని ల్యాబ్కు తరలించారు. మరో వైపు కేరళలో మంకీపాక్స్ కేసు నమోదవడంతో కేంద్రం అప్రమత్తమైంది. ప్రత్యేక ఓ బృందాన్ని పంపనున్నది.
మంకీపాక్స్ వైరస్ మశూచికి కారణమయ్యే వైరస్ల కుటుంబానికి చెందినది. కొన్ని సందర్భాల్లో జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకుతుంది. జ్వరం, విరేచనాలు, శరీరం, ముఖంపై దద్దుర్లు వస్తాయి. అనారోగ్యం నాలుగు వారాల వరకు ఉంటుంది. గత ఏడాది జూలైలో అమెరికాలోని టెక్సాస్లో రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ‘మంకీపాక్స్’ కేసు నమోదైంది. ఇప్పటికే పలు దేశాల్లోనూ చాలా కేసులు నమోదయ్యాయి.
ప్రపంచ ఆరోగ్య నెట్వర్క్ మంకీపాక్స్ను మహమ్మారిగా ప్రకటించింది. మంకీపాక్స్ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి 59 దేశాల్లో వరకు 6వేల మందికిపైగా మంకీపాక్స్ సోకింది. మంకీపాక్స్ విస్తరణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేషన్ ఆందోళన వ్యక్తం చేశారు. 80శాతానికిపైగా కేసులు యూరప్లోనే ఉన్నాయని పేర్కొన్నారు.