న్యూఢిల్లీ: రష్యాకు చెందిన కరోనా వైరస్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్కు సోమవారం నిపుణుల కమిటీ ఓకే చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఇండియాలో వినియోగానికి అందుబాటులోకి వచ్చిన మూడో వ్యాక్సిన్గా స్పుత్నిక్ వి నిలిచింది. తమ వ్యాక్సిన్కు అనుమతించిన 60వ దేశం ఇండియా అని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రభుత్వ రెగ్యులేటర్లు అనుమతుల సంఖ్య ప్రకారం చూసుకుంటే ప్రపంచంలో స్పుత్నిక్ రెండో స్థానంలో నిలుస్తుందని తెలిపింది. ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తయారు చేస్తున్న ఈ టీకా సామర్థ్యం 91.6 శాతంగా తేలిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19న ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. జనవరిలో కొవిషీల్డ్, కొవాగ్జిన్లకు అనుమతి ఇచ్చి అదే నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు ఈ నెల చివరిలోపు ఇండియాలో అందుబాటులోకి రానున్నాయి. దేశంలోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్తోపాటు మరో నాలుగు ఫార్మా కంపెనీలు ఈ వ్యాక్సిన్లను తయారు చేయనున్నాయి. ఏడాదికి 85 కోట్ల వ్యాక్సిన్ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ నెల చివరిలోపు మాత్రం పరిమిత స్థాయిలో మాత్రమే వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి.
ఇవి కూడా చదవండి
పది లక్షల టన్నుల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వృథా నీళ్లు సముద్రంలోకి!
ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ
లంగా ఓణీలో మెరిసిపోతున్న శ్రీముఖి
ఉగాది స్పెషల్.. ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ విడుదల