న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: భారత పర్యాటకులకు ఇరాన్ శుభవార్త చెప్పింది. వారు తమ దేశంలో పర్యటించడానికి వీసా కలిగి ఉండాలన్న నిబంధనను ఈ నెల 4 నుంచి కొన్ని షరతులతో ఎత్తి వేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. సాంస్కృతిక, పర్యాటక సంబంధాల మార్పిడిని మరింత వేగవంతం చేసుకొనేందుకు ఈ నూతన విధానం అమలు చేస్తున్నట్టు తెలిపింది.
ఈ ప్రకటనలో తెలిపిన నిబంధన ప్రకారం సాధారణ పాస్పోర్ట్ కలిగిన భారతీయులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీసా లేకుండా ఇరాన్లో గరిష్ఠంగా 15 రోజులు ఉండవచ్చు. అయితే ఈ కాల పరిమితిని పొడిగించరు. కేవలం పర్యాటకం కోసం వచ్చినవారికి మాత్రమే వీసా ఎత్తివేత అమలవుతుంది.