న్యూఢిల్లీ, నవంబర్ 28: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు, కార్మిక సంఘాల పిలుపు మేరకు మూడు రోజులపాటు జరిగిన దేశవ్యాప్త ఆందోళనలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఎంఎస్పీ, రుణమాఫీ, లేబర్ కోడ్ల రద్దు తదితర డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకుంటే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని రైతులు, కార్మికులు ప్రతినబూనారు. రాబోవు రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. త్వరలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకొంటామని నేతలు ప్రకటించారు.
చివరి రోజు మంగళవారం దేశవ్యాప్తంగా జరిగిన కిసాన్-మజ్దూర్ ‘మహాపడావ్’లో ఐదు అసెంబ్లీ ఎన్నికల రాష్ర్టాల మినహా దాదాపు అన్ని రాష్ర్టాల రాజధానుల్లో వేలాది సంఖ్యలో రైతులు, కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హర్యానా, పంజాబ్ తదితర రాష్ర్టాల్లో తమ 21 డిమాండ్ల చార్టర్తో కూడిన వినతిపత్రాన్ని రైతు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఆయా రాష్ర్టాల గవర్నర్లకు అందజేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం), కేంద్ర కార్మిక సంఘాలు ఈనెల 26 నుంచి 28 వరకు ఈ దేశవ్యాప్త ఆందోళనలనకు పిలుపునిచ్చాయి. గవర్నర్లకు తమ డిమాండ్ల కూడిన మెమోరాండం సమర్పించిన తర్వాత రైతులు, కార్మికులు ఈ ఆందోళనలను విరమించారు. పంజాబ్లో రైతు ప్రతినిధులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గుర్మీత్ సింగ్ను కూడా కలిసి తమ డిమాండ్లను వివరించారు.
కార్పొరేట్ల కోసం మోదీ సర్కార్!
ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద సాగిన ఆందోళనలో ఏఐటీయూసీ కార్యదర్శి అమర్జీత్ కౌర్ మాట్లాడుతూ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ మతపరమైన, ఇతర అంశాలను తెరపైకి తీసుకొన్న విషయం అందరికీ అర్థమైందన్నారు. ఆలిండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) నేత విక్రమ్ సింగ్ మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటానికి ఈ ఆందోళనలు ప్రారంభం మాత్రమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నదని దుయ్యబట్టారు. ప్రస్తుతం దేశ వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, రైతుల తమ పంటలకు కనీస మద్దతు ధర కూడా పొందలేకపోతున్నారని, ఫలితంగా అన్నదాతలు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘బీజేపీని పారదోలండి.. దేశాన్ని కాపాడండి’
తమకు వ్యతిరేకంగా పాలసీలు చేసే ప్రభుత్వాన్ని 2024 లోక్సభ ఎన్నికల్లో అనుమతించేది లేదని విక్రమ్ సింగ్ స్పష్టం చేశారు. అందుకే ‘బీజేపీని పారదోలండి.. దేశాన్ని కాపాడండి’ అనే నినాదం ఇచ్చామని అన్నారు. బీజేపీ ప్రతీ విషయంలోనూ గతంలో ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కుతున్నదని సీఐటీయూ నేత పుష్పేంద్ర సింగ్ విమర్శించారు.
కార్మికులను బానిసలుగా మార్చేందుకు లేబర్ కోడ్లు తీసుకొచ్చొందని దుయ్యబట్టారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీతో గద్దెనెక్కిన కమలం పార్టీ.. ఇప్పుడు రైతుల ఆదాయాలు పడిపోయి, నష్టాల్లో కొట్టుమిట్టాడుతుంటే చోద్యం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఎస్కేఎం, కేంద్ర కార్మిక సంఘాల నేతలు మరోసారి సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకొంటారని ఏఐసీసీటీయూ నేత శ్వేతా రాజ్ పేర్కొన్నారు.
రైతులు, కార్మికుల ముఖ్యమైన డిమాండ్లు ఇవీ..
1. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి.
2. రైతులకు రుణమాఫీ చేయాలి, వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు విరమించాలి.
3. నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి.
4. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం ఆపాలి.
5. విద్యుత్తు సవరణ బిల్లును తక్షణం వెనక్కు తీసుకోవాలి.
6. కనీస వేతనాలు పెంచాలి, యువతకు ఉపాధి కల్పించాలి.
7. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలి, ఆహార భద్రత కల్పించాలి.