న్యూఢిల్లీ: మాల్దీవుల్లోని భారత సైనికుల స్థానంలో (Indian troops in Maldives) సమర్థులైన సాంకేతిక సిబ్బందిని మోహరిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్కడ ఉన్న రెండు హెలికాప్టర్ల నిర్వహణ, వైద్యం, మానవతా సాయం కార్యకలాపాల కోసం వినియోగించే ఆర్మీని సమర్థవంతమైన భారతీయ సాంకేతిక సిబ్బందితో భర్తీ చేస్తామని గురువారం తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం దీని గురించి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఆర్మీ సిబ్బందిని సమర్థులైన భారతీయ సాంకేతిక సిబ్బందితో భర్తీ చేయనున్నట్లు చెప్పారు. దీని కోసం త్వరలో ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయిలో మూడో సమావేశం జరుగుతుందని వెల్లడించారు. అలాగే మాల్దీవులకు బడ్జెట్లో నిధుల తగ్గింపుపై సవరణ జరుగుతుందని అన్నారు. మాల్దీవులకు ముఖ్యమైన అభివృద్ధి భాగస్వామిగా భారత్ ఉంటుందని స్పష్టం చేశారు.
కాగా, మాల్దీవుల్లో ఉన్న సుమారు 75 మంది ఆర్మీ సిబ్బందిని మార్చి 15 నాటికి తొలగించాలని కొత్తగా ఎన్నికైన చైనా అనుకూల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో రెండు దేశాల మధ్య అత్యున్నత స్థాయిలో సమావేశాలు జరిగాయి. మాల్దీవుల్లో మోహరించిన ఇండియన్ ఆర్మీ అంశంపై చర్చించాయి. మార్చి 10 నాటికి ఒక విమానం స్థావరంలోని సైనిక సిబ్బందిని భారత్ భర్తీ చేస్తుందని మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది. అలాగే మే 10 నాటికి మిగతా సైనిక స్థావరాల్లోని మొత్తం సిబ్బందిని సాంకేతిక సిబ్బందితో భర్తీ చేయనున్నట్లు రెండో సమావేశం తర్వాత పేర్కొంది.