Startup India | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ‘స్టార్టప్ ఇండియా’కు కష్టాలు వచ్చిపడ్డాయి. కొత్త ఆవిష్కరణలకు ఊతమిస్తామని ఊదరగొట్టిన మో దీ.. ఆ తర్వాత స్టార్టప్ల బాగోగులు పట్టించుకోవడంలో, ఫండింగ్ కల్పించడంలో విఫలమయ్యారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో చేయూత లేకపోవడంతో స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు అంతకంతకూ తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన ఐదేండ్లలో ఎన్నడూలేనంతగా పెట్టుబడులు క్షీణించడమే దీనికి రుజువు. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఇండియన్ స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు రూ.12,474 కోట్లకు (1.5 బిలియన్ డాలర్లకు) పడిపోయినట్టు మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫాం ‘ట్రాక్సన్’ ఒక నివేదికలో వెల్లడించింది. గడిచిన ఏడాది ఇదే సమయంతో పోలిస్తే, పెట్టుబడుల్లో 54 శాతం మేర క్షీణత నమోదైనట్టు వివరించింది. ఫండింగ్కు సంబంధించి చర్చలు 48 శాతం క్షీణించడం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నది.
పెట్టుబడులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్టార్టప్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఏకంగా 2 లక్షలకుపైగా టెకీలు ఉద్యోగాలు కోల్పోయారని ట్రాక్సన్ ఇటీవలే మరో నివేదికలో వెల్లడించింది. జూన్ 30నాటికి 819 సంస్థలు దాదాపు 2,12,221 మంది ఉద్యోగులను తొలగించాయని తేలింది. గత ఏడాదితో పోల్చితే ఉద్యోగ కోతలు 40 శాతం పెరగడం గమనార్హం. మోదీ సర్కారు 2015లో ‘స్టార్టప్ ఇండియా’ పేరిట స్కీమ్ను ప్రకటించింది. అయితే, తొమ్మిదేండ్లలో దాదాపు 65 శాతం వరకు స్టార్టప్లు మూతబడ్డట్టు నివేదికలు చెబుతున్నాయి.
ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో స్టార్టప్లు తొలగించిన టెక్ ఉద్యోగాలు 2,12,221
ఉద్యోగులను తొలగించిన మొత్తం స్టార్టప్లు 819
గత ఏడాదితో పోల్చితే, ఉద్యోగ కోతల్లో పెరుగుదల 40 శాతం
ఫండింగ్కు సంబంధించి చర్చల్లో విఫలం 48 శాతం