Ayodhya | న్యూఢిల్లీ, డిసెంబర్ 16: అయోధ్య రామ మందిరాన్ని చేరుకోవాలనుకుంటున్న కోట్లాది మంది భక్తులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. దేశం నలుమూలల నుంచి 1000 రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. జనవరి 19 నుంచి 100 రోజులపాటు ఈ రైళ్లను నడుపుతామని రైల్వే వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, పుణె, నాగ్పూర్, లక్నో, జమ్ము, బెంగళూరు..ఇలా అన్ని ప్రాంతాల్లోని నగరాలను అయోధ్యకు కలుపుతూ 100 రోజులపాటు రైల్వే సేవల్ని కొనసాగిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. రోజూ 50 వేల మంది స్టేషన్లో దిగే విధంగా అయోధ్య స్టేషన్ను రీడిజైన్ చేశామన్నారు.
జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవ వేడుక నిమిత్తం అయోధ్యకు రావొద్దని ‘రామ మందిర్ ట్రస్ట్’ సెక్రెటరీ చంపత్ రాయ్ భక్తులను కోరారు. ‘విగ్రహ ప్రతిష్ఠకు ఆలయం సిద్ధం. కానీ ఆలయ నిర్మాణం పూర్తి కావాలంటే మరో రెండేండ్లు పడుతుంది. చాలా పనులు జరగాల్సి ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని, వారిని రావొద్దని సూచిస్తున్నా. ఆ రోజు భక్తులు తమకు దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లాల్సిందిగా కోరుతున్నా’ అని అన్నారు.