న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు మరింత భద్రత కల్పించడమే లక్ష్యంగా ఇండియన్ రైల్వేస్ మరో కీలక కార్యం మొదలుపెట్టింది. రైళ్లలో అగ్ని ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి అగ్ని నిరోధక (ఫైర్ రిటార్డెంట్) రైల్వే కోచ్లను అభివృద్ధి చేస్తున్నది. ఇండియన్ రైల్వే ప్రధాన కర్మాగారమైన కపుర్తలా రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ ఫైర్ రిటార్డెంట్ రైల్వే కోచ్లు తయారవుతున్నాయి. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఈ కోచ్ల పనితీరును పరిశీలించి.. అంతా అనుకూలంగా ఉంటే మిగతా కోచ్లను కూడా ఫైర్ రిటార్డెంట్ కోచ్లుగా మార్పు చేస్తామని కపుర్తలా రైల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ రవీందర్ గుప్తా తెలిపారు.
ఫైర్ రిటార్డెంట్లుగా మార్చిన రైల్వే కోచ్లలో ఎంసీబీలు, లైట్స్, టెర్మినల్ బోర్డులు, కనెక్టర్లు తదితర ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ల కోసం మెరుగైన మెటీరియల్ను వినియోగిస్తున్నామని రవీందర్ గుప్తా చెప్పారు. రైల్ కోచ్ అభివృద్ధిలో కూడా పూర్తిగా ఫైర్ రిటార్డెంట్ ఫర్నీచర్నే వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కోచ్లలో చేసిన మార్పులవల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం దాదాపు ఉండదని గుప్తా తెలిపారు.