IMD | న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోనున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరిస్తున్నది. సార్వత్రిక ఎన్నికల వేడికి భానుడి సెగలు కూడా తోడవ్వటంతో జనం ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నదని పేర్కొన్నది.
ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు కోరారు. మన దేశంలో అత్యధిక జనాభా ఉన్నది కాబట్టి పెరిగే ఉష్ణోగ్రతలను ఎదుర్కోవటం ఓ సవాల్ లాంటిందని తెలిపారు. దీన్ని ఎదుర్కోవటానికి దేశం ముందుగానే సిద్ధం కావాలని మీడియా సమావేశంలో చెప్పారు.