జమ్మూ కశ్మీర్ అంశం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని భారత ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది. చైనాతో సహా మరే ఇతర దేశం కూడా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయడానికి వీల్లేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ తేల్చి చెప్పారు. పాక్లో జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ సమావేశాల్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్యీ జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వేదిక ద్వారా మళ్లీ జమ్మూ కశ్మీర్ అంశాన్ని ఇస్లామిక్ దేశాలు ప్రస్తావించాయని, చైనా కూడా అదే లైన్ను అనుసరిస్తుందన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే భారత్ పై విధంగా స్పందించింది.
ఈ నెలాఖరులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్యీ భారత పర్యటనకు రానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే గాల్వాన్ ఘర్షణ తర్వాత చైనా నేతలు మన దేశంలో పర్యటించడం ఇదే ప్రథమం అవుతుంది. కొన్ని రోజులుగా చైనా పాక్కు దగ్గరవుతోంది. వాంగ్యీ భారత పర్యటనకు వచ్చే కొన్ని రోజుల ముందే జమ్మూ కశ్మీర్ అంశాన్ని పాక్ వేదికగా ప్రస్తావించడం గమనార్హం.