Indian Army: చైనాపై మరింత పట్టు బిగించడానికి భారత సైన్యం రెడీ అయిపోయింది. చైనాపై మరింత నిఘా పెంచేందుకు భారత సైన్యం మరిన్ని డ్రోన్లను కొనుగోలు చేయనుంది. 2021 లో హై ఎలిట్యూడ్ టాక్టికల్ డ్రోన్ల పనితీరును గమనించిన తర్వాత, చైనాపై మరింత నిఘా పెంచేందుకు మరిన్ని డ్రోన్లను కొనుగోలు చేయాలని భారత సైన్యం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి భారత్కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీకి ఆర్డర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో ఈ డ్రోన్లున్నాయని, అందుకే వీటిని ఉపయోగిస్తున్నట్లు పేర్కొంటున్నారు. గత రెండేళ్లుగా భారత, చైనా మధ్య సరిహద్దు విభేదాలు కొనసాగుతున్న విషయం విదితమే. ముఖ్యంగా లద్దాఖ్ ప్రాంతంలోనే ఈ డ్రోన్లను విరివిగా ఉపయోగంలోకి తీసుకురావాలని భారత సైన్యం భావిస్తోంది.
ఇప్పటికే మానవ రహిత విమానాలు, ఉప గ్రహాలు, పీ8ఐ వంటి ప్రత్యేక విమానాలతో సరిహద్దు ప్రాంతల్లో భారత సైన్యం నిఘా వుంచుతోంది. వీటికి తోడుగా ఈ డ్రోన్లను కూడా మరింత ఎక్కువ స్థాయిలో అందుబాటులోకి తెచ్చి, చైనాపై ఓ నిఘా ఉంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్ని డ్రోన్లను ఆర్డర్ ఇచ్చారు, వీటి ఖరీదు ఎంత ? అన్న విషయాలు మాత్రం ఇంకా తెలియడం లేదు. అయితే ఐడియోఫోర్జ్ అధినేత మాత్రం ఈ డ్రోన్ల కొనుగోలును ధృవీకరించారు.
ఈ స్విచ్డ్రోన్ల బరువు 6.5 కిలోలు వుంటుందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. హెలికాప్టర్ లాగా నిలువుగా టేకాఫ్ చేయగల సామర్థ్యం వీటికి ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రత, బలమైన గాలులు వున్నా సరే, ఎక్కువ ఎత్తులో ఇవి ఎగిరే సామర్థ్యాన్ని కలిగి వుంటాయి. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దాదాపు 2 గంటల పాటు ఈ డ్రోన్లు ఎగరగలుగుతాయి. 15 కిలోమీటర్ల మేర ఎక్కడైనా సరే పర్యవేక్షించే సామర్థ్యం దీని సొంతం.