Sikkim Land Slides | సిక్కింలో శుక్రవారం నుంచి భారీగా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై కొండ చరియలు విరిగి పడ్డాయి. రోడ్లపై కొండ చరియలు విరిగి పడటంతో దాదాపు 500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వారు ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో చిక్కుకున్నారు. ఈ సంగతి తెలిసిన వెంటనే సైన్యం అప్రమత్తమైంది. చున్ తంగ్ వద్ద రోడ్డుపై చిక్కుకున్న వారిని సైన్యం రక్షించింది. మరోవైపు రోడ్లపై పడిన కొండ చరియలను తొలగించడానికి చర్యలు తీసుకున్నది.
చున్ తంగ్ ఎస్డీఎం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు త్రిశక్తి కార్ప్స్, భారత సైన్యం రంగంలోకి దిగి పర్యాటకులను రక్షించింది. రోడ్డుపై చిక్కుకున్న వారిలో 216 మంది మహిళలు, 113 మంది మహిళలు, 54 మంది పిల్లలు ఉన్నారు. పర్యాటకులు లాచుంగ్ నుంచి లాచెన్ లోయ వైపు వెళుతున్నారు.
బాధితులను రక్షించి, మూడు స్థావరాలకు తరలించామని రక్షణ శాఖ అధికారి తెలిపారు. వారికి భోజనం, దుస్తులు అందించామని చెప్పారు. అవసరమైన వారికి వైద్య సాయం అందించినట్లు తెలిపారు.
బాధిత పర్యాటకులకు వసతుల కల్పనకు జవాన్లు తమ బ్యారక్ లను ఖాళీ చేశారని రక్షణశాఖ అధికార ప్రతినిధి వివరించారు.