శ్రీనగర్: పాకిస్థాన్ నుంచి జమ్ముకశ్మీర్లోకి చొరబడే ఉగ్రవాదులకు చెక్ చెప్పేందుకు ఆర్మీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఆయుధాల వినియోగంపై సరిహద్దు గ్రామాల ప్రజలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. రాజౌరీ జిల్లాలోని లామ్ సెక్టార్లో ఒక శిక్షణ శిబిరాన్ని ఆర్మీ నిర్వహించింది. సరిహద్దు ప్రాంతాలకు చెందిన యువతీ, యువకులతోపాటు గ్రామ రక్షణ కమిటీ (వీడీపీ) సభ్యులకు సైనిక శిక్షణ ఇచ్చింది. ఆయుధాల వినియోగం, కాల్పులు జరుపడంపై ఆర్మీ అధికారులు వారికి ట్రైనింగ్ ఇచ్చారు. జమ్ముకశ్మీర్లో పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు జరిపి హత్యలు చేస్తుండటంతో ఆర్మీ దీనికి శ్రీకారం చుట్టింది.
కాగా, సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు తమకు శిక్షణ ఇచ్చేందుకు ఒక శిబిరాన్ని ఆర్మీ ఏర్పాటు చేసిందని స్థానిక వ్యక్తి తెలిపాడు. మగవారితోపాటు మహిళలకు కూడా ఇందులో శిక్షణ ఇస్తున్నట్లు ఆయన చెప్పాడు. ఆయుధాల వినియోగం గురించి తమకు శిక్షణ ఇస్తున్న ఆర్మీకి అతడు కృతజ్ఞతలు తెలియజేశాడు.