న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీకి చెందిన చీతా హెలిక్యాప్టర్ అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ ఏరియాలో ఇవాళ ఉదయం 10 గంటలకు కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ వెంటనే రంగంలోకి దిగి గాయపడిన ఇద్దరు పైలట్లను సమీప మిలిటరీ ఆస్పత్రికి తరలించాయి.
చికిత్స పొందుతూ పైలట్లలో ఒకరైన లెఫ్టి కల్నల్ సౌరభ్ యాదవ్ ప్రాణాలు కోల్పోయారు. మరో పైలట్కు చికిత్స కొనసాగుతున్నది. భారత ఆర్మీ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఈ హెలిక్యాప్టర్ ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉంది.
చీతా హెలిక్యాప్టర్లను 1976 నుంచి హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తున్నది. ఈ హెలిక్యాప్టర్లను ఆర్మీ రకరకాల సేవలకు వినియోగిస్తున్నారు. మిగతా హెలిక్యాప్టర్లతో పోల్చితే అత్యంత ఎత్తుకు ఎగరగల హెలిక్యాప్టర్లుగా కూడా వీటికి పేరున్నది. ఆర్మీ స్థావరాలపై గస్తీ నిర్వహణలో, విపత్తుల సందర్భంగా రక్షణ, సహాయక చర్యల్లో వీటిని వినియోగిస్తున్నారు.