Anti Tank Missile | భారత సైన్యం దేశీయంగా అభివృద్ధి చేసిన ‘మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్’ను విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్లో శనివారం యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థని నిర్వహించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశంలో తయారైన ఈ క్షిపణి వ్యవస్థను ఎక్కడికైనా తీసుకువెళ్లే అవకాశం ఉన్నది.
దీంతో సైన్యంలోకి యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థను చేర్చడానికి మార్గం సుగమమైంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఈ వెపన్ సిస్టమ్ను రూపొందించిందని అధికారులు తెలిపారు. ఇందులో ఎంపీఏటీజీఎం, లాంచర్, టార్గెట్ అక్విజిషన్ ఎక్విప్మెంట్, ఫైర్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినందుకు డీఆర్డీవో, భారత సైన్యాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ ప్రశంసించారు. ఆధునిక సాంకేతిక ఆధారిత రక్షణ వ్యవస్థల అభివృద్ధిలో స్వావలంబన సాధించే దిశగా ఇది ఓ కీలకమైన ముందడుగు అని పేర్కొన్నారు.
ఎంపీఏటీజీ ఆయుధ వ్యవస్థను పలుమార్లు మదింపు చేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. ఈ ఆయుధ వ్యవస్థను శనివారం పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో విజయవంతంగా పరీక్షించినట్లు పేర్కొంది. మిస్సైల్ సిస్టమ్ అద్భుతమైన పనితీరును పరీక్షించిందని తెలిపింది. ఈ యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థను పగలు, రాత్రి సమయాల్లోనూ వినియోగించవచ్చని చెప్పింది. ఈ మిస్సైల్ ప్రయోగంలో పాల్గొన్న సిబ్బందిని డీఆర్డీవో చైర్మన్ సమీర్ వీ కామత్ అభినందించారు.