Piyush Goyal : ఇండియా-అమెరికా ట్రేడ్ డీల్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా టారిఫ్లను ట్రంప్ తగ్గించాడు. నేటి నుంచే ఈ టారిఫ్లు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే ఉత్పత్తులపై ఎలాంటి పన్నులు ఉంటాయి.. అవి ఇండియాకు ఎలాంటి మేలు కలిగిస్తాయి అనే అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ అంశంపై కేంద్ర వాణిజ్య పన్నులు, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శనివారం స్పందించారు.
ఇండియా-అమెరికా మధ్య కొన్ని ఉత్పత్తులపై సున్నా శాతం సుంకాలు విధించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ట్రేడ్ డీల్ వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. రైతులకు నష్టం కలగకుండా కొన్ని ఉత్పత్తుల్ని డీల్కు దూరంగా ఉంచినట్లు చెప్పారు. ఇండియా నుంచి ఎగుమతి అయ్యే సోయాబీన్ ఆయిల్పై పరిమిత కోటా వరకు జీరో టారిఫ్లు ఉంటాయి. అలాగే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే యాపిల్స్పై కూడా సున్నా సుంకాలుంటాయి. సుంకాలు లేకుండా కనీసం 80 రూపాయలకు కేజీ యాపిల్స్ దిగుమతి చేసుకుంటారు. అలాగే వైన్స్, ఆల్కహాల్ డ్రింక్స్, పప్పు ధాన్యాలు, క్యాన్సర్ డ్రగ్స్, కెమికల్స్, మెడికల్ డివైజెస్ వంటివి జీరో టారిఫ్స్ కిందకు వస్తాయి. వీటి దిగుమతులపై ఎలాంటి పన్ను ఉండదు. దీంతో ఇవి భారత మార్కెట్లో చవకగా లభిస్తాయి. అలాగే ఇండియా నుంచి ఎగుమతి అయ్యే ఫార్మా ఉత్పత్తులు, రత్నాలు, వజ్రాలు వంటి వాటిపై అమెరికా ఎలాంటి టారిఫ్లు విధించదు.
అలాగే మన దేశం నుంచి భారీగా ఎగుమతి చేసే స్మార్ట్ఫోన్లపై కూడా సున్నా సుంకాలే. వ్యవసాయ రంగానికి సంబంధించి మసాలా దినుసులు, టీ, కాఫీ పౌడర్లు, కొబ్బరి ఉత్పత్తులు, వివిధ రకాల నట్స్, పండ్లు, కూరగాయలు కూడా అమెరికాకు జీరో టారిఫ్ కేటగిరిలోనే ఎగుమతి అవుతాయి. వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్లు తగ్గడం వల్ల మన ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో ఎక్కువగా అమ్మకాలు సాగుతాయి. ఇది మన రైతులకు మేలు చేస్తుంది. మనం దిగుమతి చేసుకునే కొన్ని ఉత్పత్తులు, ఎగుమతి చేసే ఉత్పత్తుల్ని జీరో టారిఫ్ కేటగిరిలోకి తెచ్చి, ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాయి ఇరు దేశాలు.