న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్, అమెరికా ఎయిర్ఫోర్స్ దళాల సంయుక్త యుద్ధ విన్యాసాలు సోమవారం ప్రారంభమయ్యాయి. పశ్చిమబెంగాల్లోని కలైకుంద ఎయిర్బేస్లో ఈ నెల 21 వరకు ఈ విన్యాసాలు జరగనున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ విమానాల కార్యకలాపాలను మరింత బలోపేతం, సమర్థవంతం చేసే క్రమంలో భాగంగా ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు.
విన్యాసాలకు అమెరికా ‘ఎఫ్-15 స్ట్రైక్ ఈగల్ ఫైటర్ జెట్’లను తీసుకురానున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సైనిక కూటమిని బలోపేతం చేసే దిశగా భారత ఎయిర్ఫోర్స్ ఇప్పటికే పలు దేశాలతో యుద్ధ విన్యాసాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవలే యూకే, యూఏఈ దేశాలతో సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టింది.