న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) సమీపంలో భారత్, అమెరికా కలిసి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అయితే దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్, అమెరికా సంయుక్త సైనిక వ్యాయామం ‘యుధ్ అభ్యాస్’ 18వ ఎడిషన్ ప్రస్తుతం ఉత్తరాఖండ్లో జరుగుతున్నది. భారత్, చైనా సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ప్రారంభమైన ఈ సైనిక విన్యాసాలు రెండు వారాలు కొనసాగనున్నాయి. శాంతి పరిరక్షణ, విపత్తు సహాయక చర్యల్లో ఇరు దేశ సైన్యాల మధ్య పరస్పర సహకారం, నైపుణ్యాన్ని అందిపుచ్చుకునేందుకు సంయుక్త ఆర్మీ డ్రిల్ జరుగుతున్నది.
కాగా, ఎల్ఏసీ సమీపంలో భారత్, అమెరికా సైనికుల సంయుక్త విన్యాసాలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. 1993, 1996లో భారత్, చైనా మధ్య జరిగిన ఒప్పందాల స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. పాకిస్థాన్ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ ఈ మేరకు సమాధానమిచ్చారు. భారత్, చైనా మధ్య పరస్పర విశ్వాసానికి ఈ విన్యాసాలు వ్యతిరేకమని అన్నారు.
మరోవైపు ఈ ఒప్పందాలను ఉల్లంఘించిన చైనా 2020 మేలో లడఖ్లోని గాల్వాన్ లోయ వద్ద భారీగా సైనికులను మోహరించింది. కీలకమైన సైనిక స్థావరాలను ఆక్రమించేందుకు ప్రయత్నించింది. ఈ సందర్భంగా ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరువైపులా ప్రాణనష్టం జరిగింది. దీంతో సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో భారత్, చైనా పోటాపోటీగా సైనిక బలగాలను మోహరించాయి. అయితే అనంతరం పలు దఫాలుగా జరిగిన సైనిక చర్చల్లో భాగంగా బలగాలను వెనక్కి మళ్లించాయి.