Amit Shah : దేశంలోకి భూమార్గం ద్వారా అక్రమ చొరబాట్లను నివారించేందుకు త్వరలో దేశ సరిహద్దుల్ని ‘స్మార్ట్ బార్డర్’ ప్రాజెక్ట్ పరిధిలోకి మార్చనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. త్వరలో ‘స్మార్ట్ బార్డర్’ ప్రాజెక్ట్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. సరిహద్దుల్లో రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం చేసేందుకు సాంకేతికతను ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు.
ముఖ్యంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్లను ఆపేందుకు ఆధునిక నిర్మాణాలు చేపడుతున్నట్లు చెప్పారు. అత్యాధునిక సెక్యూరిటీ కెమెరాలు, రాడార్లు, సెన్సర్లు, సర్వైలెన్స్ టూల్స్, రియల్ టైమ్ మానిటరింగ్ ప్లాట్ఫామ్స్ వంటివి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. బంగ్లా, పాక్ సహా అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఇందుకోసం ప్రత్యేకంగా భూమిని కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాదిలోనే వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం పశ్చిమ బెంగాల్లో కూడా ప్రభుత్వం భూమిని కేటాయించిందన్నారు. కొత్త నిర్మాణాల ద్వారా అక్రమ చొరబాట్లను వెంటనే గుర్తించి అడ్డుకోవచ్చన్నారు.
అలాగే, సరిహద్దులో డ్రోన్ యాక్టివిటీస్, పశువులు అక్రమ రవాణా, డ్రగ్ ట్రాఫికింగ్ సహా ఎలాంటి అనుమానాస్పద కదలికలనైనా వెంటనే గుర్తించవచ్చని తెలిపారు. ఎలాంటి చొరబాటు, చర్యను గమనించినా.. వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి అలర్ట్ వెళ్తుందని వెల్లడించారు. దేశానికి ఐదు దశాబ్దాలుగా ఉన్న నక్సల్స్ సమస్య ముగింపు దశకు చేరుకుందన్నారు. త్వరలో ఇండియా నక్సల్ ఫ్రీ దేశం అవుతుందని అభిప్రాయపడ్డారు. మన సైన్యం ఈ విషయంలో తమ సత్తా చాటిందని, సమస్యను కూకటివేళ్లతో సహా పెకిలించామని చెప్పుకొచ్చారు.
పాకిస్తాన్ ఉగ్ర చర్యలకు పాల్పడిన ప్రతిసారీ ఇండియా ఘాటుగా స్పందించిందన్నారు. తమ హయాంలో మూడుసార్లు పాక్కు సమాధానం చెప్పామని అమిత్ షా వివరించారు. రాష్ట్రాలు, కేంద్రం కలిపి సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నాయని తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి అక్రమంగా చొరబడుతున్న సంగతి తెలిసిందే.