Pahalgam attack : పహల్గాం దాడి జరిగి దాదాపు ఏడాది కావస్తోంది. గత ఏడాది ఏప్రిల్ 22న జమ్ము కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. హిందువులే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో 25 మంది మరణించారు. వీరిలో ఇండియాతోపాటు నేపాల్కు చెందిన వారు కూడా ఉన్నారు. పర్యాటక ప్రాంతంలో ఆనందంగా గడుపుతున్న పర్యాటకుల్ని ఉగ్రవాదులు హతమార్చారు.
ఈ ఘటన ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇండియా.. ఈ అంశానికి ప్రాధాన్యం కల్పించాలనుకుంటోంది. పాకిస్తాన్ ఉగ్రవాద వైఖరిని మరోసారి ప్రపంచానికి చూపాలనుకుంటోంది. దీనిలో భాగంగా పహల్గాం ఘటనపై అమెరికాలోని క్యాపిటోల్ హిల్ ప్రాంతంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయబోతుంది. పహల్గాం దాడి జరిగి ఏడాది పూర్తైన సందర్భంగా అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు అక్కడి రాయబారి వినయ్ మోహన్ క్వత్రా తెలిపారు.
దీనికి ‘ద హ్యూమన్ కాస్ట్ ఆఫ్ టెర్రరిజం’ అనే పేరు పెట్టారు. ఇందులో పాకిస్తాన్ కుట్రను, వారి ఉగ్రవాద మూలాల్ని బలంగా ప్రదర్శించబోతున్నారు. అలాగే, దాడి ఘటనలో మృతులకు నివాళి అర్పిస్తారు. ఒక పక్క ఇరాన్ వార్ సమయంలో చర్చల్లో పాల్గొంటూ, శాంతి కపోతంలా వ్యవహరిస్తున్న పాక్ నిజస్వరూపాన్ని ఈ ఎగ్జిబిషన్ మరోసారి ప్రపంచానికి చూపించబోతుంది. పహల్గాం దాడి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్పై దాడి చేసిన సంగతి తెలిసిందే.