India Vs Canada | భారత్-కెనడా మధ్య దౌత్యసంక్షోభం ముదురుతున్నది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కెనడాలోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికే హెచ్చరించిన భారత్.. తాజాగా కెనడావాసుల వీసా దరఖాస్తులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దౌత్యసిబ్బందిని తగ్గించుకోవాలంటూ కెనడాకు స్పష్టంచేసింది. ఇరుదేశాలు వివాదానికి ముగింపు పలకాలని ఎన్నారైలు, విద్యార్థులు కోరుతున్నారు.
న్యూఢిల్లీ: భారత్-కెనడా మధ్య నెలకొన్న వివాదం ముదురుతున్నది. రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దౌత్యపరమైన సంబంధాలు క్షీణిస్తున్నాయి. కెనడాలోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలంటూ బుధవారం సూచించిన భారత్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కెనడా వాసుల వీసా దరఖాస్తుల ప్రాసెస్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. కెనడాలోని భారత హైకమిషనర్, కాన్సులేట్లకు బెదిరింపులు వస్తున్నట్టు తెలిపింది. భద్రతా కారణాల రీత్యా వీసా దరఖాస్తులు ప్రాసెస్ చేయడం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు.
వారిని భారత్కు అప్పగించాలి…
ఇతర దేశాల్లోని కెనడా వాసులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ‘పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం. అయితే ఇప్పుడు భద్రత విషయం గురించి మాట్లాడడం సరికాదు. భారత వ్యతిరేక శక్తులకు కెనడా స్వర్గధామంగా మారింది. వారికి కెనడా ప్రభుత్వం ఆశ్రయం కల్పించొద్దని కోరుకుంటున్నాం. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. లేదంటే న్యాయ విచారణ ఎదుర్కొనేందుకు వారిని భారత్కు పంపించాలి’ అని బాగ్చి తెలిపారు.
దౌత్య సిబ్బందిని తగ్గించుకోండి
భారత్లో ఉన్న కెనడా దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని భారత్ ఆ దేశానికి సూచించింది. ‘కెనడా దౌత్య సిబ్బంది ఎక్కువ సంఖ్యలో ఉంది. కెనడాలో భారత దౌత్య సిబ్బంది సంఖ్య పరిమితంగానే ఉంది. ర్యాంకు, సంఖ్య ఆధారంగా సిబ్బందిని పరిమితం చేసుకోవాలి’ అని బాగ్చి తెలిపారు.
కెనడా ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవి
ఖలిస్థాన్ వేర్పాటువాద నేత నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా చేసిన ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. కెనడా ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని బాగ్చి పేర్కొన్నారు. ట్రూడో ఆరోపణల్లో పక్షపాతం ఉందని తెలిపారు. భారత్ తన వైఖరిని స్పష్టం చేసిందని వెల్లడించారు.
స్పందించేందుకు నిరాకరించిన ట్రూడో
నిజ్జర్ హత్యలో భారత హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత్ ఖండించిన విషయం తెలిసిందే. అయితే భారత్ ఖండించిన అంశాన్ని విలేకర్లు ట్రూడో వద్ద ప్రస్తావించగా.. దానికి స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ఆయన్ను విలేకర్లు ఈ విషయం అడిగారు.
కెనడా సురక్షిత ప్రాంతం
భారత్ బుధవారం జారీ చేసిన ప్రయాణ అడ్వైజరీని కెనడా ఖండించింది. తమ దేశం ఎంతో సురక్షితమైన ప్రాంతమని కెనడా పేర్కొంది. కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ మాట్లాడుతూ ప్రయాణాలకు కెనడా ఎంతో సురక్షితమైన దేశమని పేర్కొన్నారు. ఎటువంటి భయం లేకుండా కెనడాలో ప్రయాణాలు చేయవచ్చని ఆయన తెలిపారు.
భద్రతపై సమీక్షిస్తున్నాం
భారత్లోని తమ హైకమిషనర్కు బెదిరింపులు వస్తున్నాయని కెనడా ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్మీడియాలో తమ సిబ్బంది, హైకమిషనర్ను బెదిరిస్తున్నట్టు పేర్కొంది. భారత్లోని తమ సిబ్బందిని కూడా సురక్షితంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. భారత్లోని తమ సిబ్బందిపై అంచనా వేస్తున్నట్టు ఆ దేశం పేర్కొంది. వారి భద్రతను సమీక్షిస్తున్నట్టు తెలిపింది.
ప్రెసిడెన్షియల్ సూట్ను నిరాకరించిన ట్రూడో…
జీ20 సమావేశాల సందర్భంగా భారత్కు విచ్చేసిన కెనడా ప్రధాని ట్రూడో భారత్ సమకూర్చిన విలాసవంతమైన విడిదిని నిరాకరించారని తెలుస్తున్నది. జీ20 సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన వివిధ దేశాధినేతలకు ప్రెసిడెన్షియల్ సూట్ను సమకూర్చింది. అయితే ఢిల్లీలోని లలిత్ హోటల్లో బస చేసిన ట్రూడో ఈ విలాసవంతమైన విడిదిని కాదన్నారు. సాధారణ రూమ్లోనే ఉన్నారు. మరోవైపు తిరిగి వెళ్లేటప్పుడు కెనడాకు చెందిన ఎయిర్బస్ స్పెషల్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తగా.. భారత్ ప్రత్యేకంగా ఎయిర్ఇండియా వన్ను సమకూర్చగా దాన్ని కూడా కెనడా ప్రధాని నిరాకరించారు.
ట్రూడోకు సొంత పార్టీలోనే ఎదురుదెబ్బ
ట్రూడోకు సొంత పార్టీలోనే ఎదురుదెబ్బ తగిలింది. నిజ్జర్ హత్యకు సంబంధించి ట్రూడో భారత్పై చేసిన ఆరోపణలను సొంత పార్టీ నేత ఒకరు ఖండించారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట ద్వేషపూరిత నేరాలను అనుమతించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. లిబరల్ పార్టీ ఆఫ్ కెనడాకు చెందిన భారత సంతతి నేత హౌజ్ ఆఫ్ కామన్స్ ఆఫ్ కెనడా మెంబర్ (ఎంపీ) చంద్ర ఆర్య కెనడాలో జరుగుతున్న పరిణామాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖలిస్థానీ ఉద్యమ నేత గుర్పత్వంత్ సింగ్ పన్నుమ్ బహిరంగంగా భారతీయ హిందువులను బెదిరించారని ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ హిందువులు కెనడాను వీడి వెళ్లిపోవాలని హెచ్చరించారని గుర్తుచేశారు. కెనడాలోని భారతీయులను హిందువులు, సిక్కులుగా విడగొడుతున్నారని పేర్కొన్నారు.
మరో ఖలిస్థాన్ మద్దతుదారుడి హత్య
కెనడాలో తలదాచుకుంటున్న ఓ ఖలిస్థాన్ మద్దతుదారుడిని గురువారం తెల్లవారుజామున కొందరు దుండగులు హతమార్చారు. కెనడాలోని గ్యాంగ్స్టర్ ముఠాల మధ్య వర్గపోరులో భాగంగా ఆయన శత్రువులు అతన్ని మట్టుబెట్టినట్టు తెలుస్తున్నది. పంజాబ్కు చెందిన సుఖ్దుల్ సింగ్పై 18 కేసులు ఉన్నాయి. 2017లో భారత్ నుంచి పారిపోయిన ఆయన కెనడాలో తలదాచుకుంటున్నారు. ఖలిస్థానీ ఉగ్రవాదీ అర్షదీప్ దల్లాతో సుఖ్దుల్కు సంబంధాలు ఉన్నాయి. కాగా, గ్యాంగ్స్టర్ సుఖ్దుల్ సింగ్ను తామే చంపామని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ వర్గం తెలిపింది. ఈ మేరకు లారెన్స్ వర్గానికి చెందిన ఫేస్బుక్లో పోస్టు చేశారు. గ్యాంగ్స్టర్లు గుర్లాల్ బ్రార్, విక్కీ మిద్దుఖేరాలను హతమార్చడంలో సుఖ్దుమ్ కీలకపాత్ర పోషించాడని అందులో పేర్కొన్నారు. కాగా, లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
భారతీయ హిందువుల లేఖ
కెనడాలో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పలువురు భారతీయ హిందువులు ప్రభుత్వానికి లేఖ రాశారు. నిషేధిత ఎస్ఎఫ్జే నేత గురుపత్వంత్ సింగ్ పన్నుమ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ద్వేషపూరిత నేరంగా పరిగణించాలని అందులో కోరారు. ఈ మేరకు పబ్లిక్ సేఫ్టీ మినిస్టర్ డొమినిక్ లెబ్లాన్స్కు కెనడియన్ హిందువులు లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, న్యూ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్లకు లేఖ రాశారు.
రెచ్చగొట్టడం మా ఉద్దేశం కాదు: ట్రూడో
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన స్వరం మార్చారు. ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య విషయంలో చేసిన వ్యాఖ్యలతో భారత్ను రెచ్చగొట్టడం కానీ, సమస్యలు సృష్టించి దౌత్యపరమైన ఇబ్బందులు తేవాలని తాము చూడటం లేదని, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, దాని వెనుక గల నిజాలను వెలికి తీయడానికి తమతో కలిసి పనిచేయాలని భారత్కు విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన అన్నారు. జస్టిన్ చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దెబ్బతింటున్న దౌత్య సంబంధాల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు.