IMD | న్యూఢిల్లీ, జూన్ 27: ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్స్లో భారతదేశం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మూడు స్థానాలు దిగజారి 40వ స్థానానికి పరిమితమైంది. 2022లో 37వ స్థానంలో ఉండేది. 2019-21 మధ్య మూడేళ్లు భారత్ వరుసగా 43వ ర్యాంకుతోనే సరిపెట్టుకుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (ఐఎండీ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. భారత్ తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్నా ఇతర దేశాలతో పోలిస్తే వ్యాపార సామర్థ్యం, మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రదర్శన వంటివాటిలో కొంత వెనుకబడి ఉంది. మారకం రేటు స్థిరత్వం, పరిహారం స్థాయిలు, కాలుష్య నియంత్రణలో మెరుగదల వంటివి భారత స్కోరులో సాయపడ్డాయి.
అధిక జీడీపీ వృద్ధిని కొనసాగించడం, ఆర్థిక మార్కెట్ అస్థిరతను ఎదుర్కోవడం, ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు నియంత్రణ, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ను వేగవంతం చేయడం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వనరుల సమీకరణ వంటి సవాళ్లను భారత్ ఈ ఏడాది ఎదుర్కొంటున్నదని ఐఎండీ తన నివేదికలో వివరించింది. ఐఎండీ తాజా జాబితాలో సింగపూర్ ఒక స్థానం పడిపోయి నాలుగో స్థానానికి పరిమితం కాగా, డెన్మార్క్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. నెదర్లాండ్స్ ఐదో స్థానం దక్కించుకోగా, తైవాన్, హాంకాంగ్, స్వీడన్, అమెరికా, యూఏఈ వరుసగా టాప్-10లో నిలిచాయి.