ఐజ్వాల్: భారత్లోకి చొరబడిన మయన్మార్ సైనికులను (Myanmar Soldiers) కేంద్ర ప్రభుత్వం తిరిగి వారి దేశానికి పంపిస్తున్నది. గత కొంత మయన్మార్లో (Myanmar) సైనిక పాలకులు, తిరుగుబాటు దళాలకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం జరగుతున్నది. దీంతో ఆ దేశానికి చెందిన వందలాది మంది సైనికులు పారిపోయి సరిహద్దు రాష్ట్రమైన మిజోరామ్కు (Mizoram) వస్తున్నారు. ఇలా గతవారం దేశంలోకి చొరబడిన 276 మంది సైనికుల్లో 184 మందిని తిరిగి వారి మయన్మార్కు పంపినట్లు అస్సామ్ రైఫిల్స్ (Assam Rifles)కు చెందిన అధికారులు వెల్లడించారు. మిగిలిన 92 మందిని నేడు పంపనున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో 635 మంది మయన్మార్ సైనికులు భారత్లోకి చొరబడ్డారు.
కాగా, మణిపూర్ సరిహద్దుల్లో స్వేచ్ఛా సంచారాన్ని నియంత్రిస్తూ బంగ్లాదేశ్ సరిహద్దుల మాదిరిగానే మయన్మార్ సరిహద్దులో కూడా త్వరలో కంచె వేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 19న ప్రకటించారు. బంగ్లాదేశ్ సరిహద్దుల మాదిరిగానే మయన్మార్తో భారత్ సరిహద్దులను కూడా పరిరక్షిస్తామన్నారు. మయన్మార్తో చేసుకొన్న సరిహద్దుల్లో స్వేచ్ఛా సంచారానికి సంబంధించిన ఒప్పందం(ఎఫ్ఎంఆర్)పై పునఃపరిశీలన చేస్తామని, త్వరలో దానికి ముగింపు పలుకుతామని తెలిపారు. ప్రసుత్తం రెండు దేశాల మధ్య అమల్లో ఉన్న ఒప్పందం మేరకు భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని 16 కిలోమీటర్ల పరిధిలో నివసించే ఇరుదేశాల ప్రజలు వీసా లేకుండా, ఎలాంటి భద్రతా తనిఖీలు లేకుండా ఒకరి భూభాగాల్లోకి మరొకరు వెళ్లేందుకు అవకాశం ఉన్నది.
మయన్మార్లో 2021లో సైన్యం ప్రభుత్వాన్ని కూల్చి పాలనా పగ్గాలు చేజిక్కించుకొన్నది. అయితే గత కొంత కాలంగా ప్రజాస్వామ్య అనుకూలవాదులతో కూడిన సాయుధ బృందాలు కూటములుగా సైనిక పాలనను ప్రతిఘటిస్తున్నాయి. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలతో మయన్మార్లో అంతర్యుద్ధం నెలకొన్నది. ఈ ఘర్షణల వల్ల ఇప్పటి వరకు దాదాపు 600 మంది సైనికులు సరిహద్దులు దాటి మన దేశంలోకి ప్రవేశించినట్టు సమాచారం. అంతర్యుద్ధం కారణంగా శరణార్థులు సరిహద్దుల గుండా పెద్దయెత్తున దేశంలోకి ప్రవేశిస్తుండటంపై గత నెల భారత్ తన ఆందోళనను మయన్మార్ పాలకుల దృష్టికి తీసుకెళ్లింది.