న్యూఢిల్లీ : తాలిబన్ల పాలన మొదలైన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. పేదరికం, ఆకలి, నిరుదోగ్యం భారీగా పెరిగింది. ఈ క్రమంలో కరోనాతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను ఎదుర్కోవడం కష్టతరంగా మారింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆఫ్ఘన్ ప్రజలకు మరోసారి సహాయం అందించేందుకు భారత్ ముందుకు వచ్చింది. కాబూల్లోని ఇందిరా గాంధీ ఆసుపత్రికి భారతదేశం 5లక్షల కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ మోతాదులను విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.
ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాబోయే కొద్ది వారాల్లో, ఐదు లక్షల డోసుల కొవాగ్జిన్ టీకాలను పంపనున్నట్లు పేర్కొంది. ఇవే కాకుండా ఆఫ్ఘన్ ప్రజలను ఆకలి నుంచి రక్షించేందుకు ఆహార ధాన్యాలు, ప్రాణాలను రక్షించే మందులను సైతం భారత్ పంపింది. ఆఫ్ఘనిస్తాన్కు 1.6 టన్నుల వైద్య సహాయాన్ని పంపినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఈ సహాయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా భారత్ అందజేసింది.